logo

విద్యార్థి ఉసురు తీసిన వివాహేతర సంబంధం

పెళ్లయి పిల్లలున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువ విద్యార్థి కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్‌లో జరిగింది.

Published : 24 Mar 2023 01:11 IST

కొండపాక: పెళ్లయి పిల్లలున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువ విద్యార్థి కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్‌లో జరిగింది. మంగోల్‌ గ్రామానికి చెందిన లగిశెట్టి అభిషేక్‌ (19) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ హైదరాబాద్‌ సుచిత్ర ప్రాంతంలోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్నాడు. అక్కడే ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల ఆమె మరొకరితో చనువుగా ఉండటం సహించలేని అభిషేక్‌ మానసికంగా కుంగిపోయాడు. మంగోల్‌లో పొలం వద్ద ఈ నెల 17న పురుగు మందు తాగాడు. ఇంటి ముందుకు నడుచుకుంటూ వచ్చి పడిపోయాడు. తల్లిదండ్రులు చూసి ఏమైందని అడుగగా విషయం చెప్పాడు. హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు గురువారం ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ పుష్పరాజ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


సాంబారు గిన్నెలో పడి విద్యార్థికి గాయాలు

చికిత్స పొందుతున్న శివరుద్ర

హత్నూర, న్యూస్‌టుడే: వడ్డించడానికి సిద్ధం చేసిన వేడి సాంబారు గిన్నెలో పడటంతో విద్యార్థికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. జహీరాబాద్‌ మండలం రంజోల్‌కు చెందిన శివరుద్ర హత్నూరలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఉగాది(బుధవారం) రోజున ఉపాధ్యాయులు పాఠశాలలో తయారు చేసిన పచ్చడిని పంపిణీ చేయడానికి ఆవరణలో ఏర్పాట్లు చేశారు. పొయ్యి మీది నుంచి దించిన వేడి సాంబారు ఆ పక్కనే ఉంచారు. పచ్చడి కోసం విద్యార్థులంతా గుమికూడగా.. శివరుద్ర వేడి సాంబారు గిన్నెపై కూర్చునే యత్నం చేశాడు. మూత పక్కకు జరగడంతో గిన్నెలో పడిపోయాడు. శరీర భాగాలకు గాయాలయ్యాయి. బాలుడు మంటల్ని తాళలేక పరుగెత్తుకుంటూ బోరునీటి ధార కిందకు వెళ్లాడు. క్షణాల్లో ఒంటిపై బుగ్గలు ఏర్పడ్డాయి. మిగతా విద్యార్థులు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. కేర్‌ టేకర్లు అందుబాటులో లేకపోవడమే ప్రమాదానికి కారణమని తెలిసింది. గాయపడిన బాలుడిని ఉపాధ్యాయులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై గురుకుల విద్యాలయ సంస్థ ఓఎస్డీ చంద్రాకాంత్‌రెడ్డి విచారణకు ఆదేశించగా.. గురువారం ఆర్సీఓ(ప్రాంతీయ సమన్వయ అధికారి) భీమయ్య పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా మాట్లాడి వివరాలు సేకరించారు. చికిత్స పొందుతున్న బాలుడితో చంద్రాకాంత్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వంట గ్యాస్‌కు బదులుగా ఆరుబయట కట్టెల పొయ్యిపైన వంట చేసి వడ్డిస్తున్నారని విద్యార్థులు విచారణ అధికారి భీమయ్య దృష్టికి తీసుకెళ్లారు.


కుటుంబ కలహాలతో  మేస్త్రీ..

చేగుంట, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో ఓ మేస్త్రీ ఆత్మహత్య చేసుకున్న ఘటన చేగుంట మండలం చందాయిపేటలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తలారి నరేందర్‌ (32)కి ఇదే మండలం పెద్దశివునూర్‌కు చెందిన నాగలక్ష్మితో 9 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఒకరే సంతానం. రెండేళ్లుగా నరేందర్‌ అత్తగారింటి వద్ద ఉంటూ మేస్త్రీ పనులు చేసుకుంటున్నాడు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. 20 రోజుల కిందట భార్యతో గొడవపడిన నరేందర్‌ చందాయిపేటలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చేశాడు. బుధవారం రాత్రి భోజనం చేసి బయటకు వెళ్లి రాలేదు. ఎంతసేపటికీ కుమారుడు రాకపోవడంతో తల్లి మల్లవ్వ అన్ని చోట్ల వెతుకుతుండగా పాత ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.


ట్రాక్టర్‌ బోల్తా పడి ఉపాధి హామీ కూలీ మృతి

తొగుట, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పనుల్లో గురువారం అపశ్రుతి చోటుచేసుకొంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం జప్తిలింగారెడ్డిపలిలో సింగాయ కుంట నుంచి మట్టిని పంట పొలాలకు తరలిస్తుండగా కట్ట ఎక్కే క్రమంలో ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఉపాధి హామీ కూలీ బ్యాగరి ఉమారాజు (31) మృతి చెందాడు. గ్రామస్థులు, అధికారులు, పోలీసులు వివరాలు తెలిపారు. ఉమారాజు రోజూ సొంత ట్రాక్టర్‌తో గ్రామశివారులోని సింగాయ కుంట నుంచి పొలాలకు మట్టిని తరలిస్తున్నాడు. వాహనం బోల్తాపడగానే తోటి కూలీలు వెంటనే ఉమారాజును సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. అతడికి తల్లిదండ్రులు, భార్య సుజాత, ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు చందన, శివమహేశ్‌ ఉన్నారు. డీఆర్‌డీవో గోపాలరాజు, తొగుట ఎంపీడీవో శ్రీధర్‌, ఏపీవో కిషన్‌, వైస్‌ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు ఖలీమొద్దీన్‌ వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని డీఆర్‌డీవో చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని