logo

బర్దీపూర్‌లో భగ్గుమన్న భూ తగాదా!

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దీపూర్‌లో భూ తగాదాలు భగ్గుమన్నాయి. పొలం పంపకం విషయంలో బండమీది చంద్రయ్య(60) దారుణ హత్యకు గురయ్యాడు

Updated : 29 Mar 2023 06:32 IST

 పెదనాన్నను దారుణంగా హత్యచేసిన తమ్ముడి కుమారుడు

వీడియో రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌

న్యూస్‌టుడే- ఝరాసంగం, జహీరాబాద్‌ అర్బన్‌: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దీపూర్‌లో భూ తగాదాలు భగ్గుమన్నాయి. పొలం పంపకం విషయంలో బండమీది చంద్రయ్య(60) దారుణ హత్యకు గురయ్యాడు. జహీరాబాద్‌ గ్రామీణ సీఐ వెంకటేశ్‌, గ్రామస్థులు తెలిపిన వివరాలు.. బర్దీపూర్‌కు చెందిన చంద్రయ్య, రత్నం అన్నదమ్ములు. మూడెకరాల పొలం పంపకం విషయంలో కొన్నేళ్లుగా వారి మధ్య గొడవలున్నాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినా.. గొడవలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం చంద్రయ్య పొలానికి వెళ్లిన విషయం తెలుసుకున్న ఆయన తమ్ముడు రత్నం కుమారుడు రాకేశ్‌ అటవీ ప్రాంతంలో మాటువేశాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న చంద్రయ్యను అడ్డగించి వెంట తెచ్చుకున్న తల్వార్‌తో మెడపై వేటు వేసి తల, మొండెం వేరు చేశాడు.

వివరాలు చెబుతున్న రాకేశ్‌

తలతో ఊళ్లో హల్‌చల్‌..

చంద్రయ్య తలను గ్రామంలోకి తీసుకొచ్చిన రాకేశ్‌ హల్‌చల్‌ చేశాడు. ఊరి నడిబొడ్డున ఉన్న బసవేశ్వర విగ్రహం వద్దకు వచ్చి.. ‘నన్ను, నా కుటుంబాన్ని మా పెదనాన్న ఏళ్లుగా వేధిస్తున్నాడు. న్యాయంగా దక్కాల్సిన భూమి పంచకుండా రాజకీయం చేస్తున్నాడు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఆయనకే మద్దతుగా నిలుస్తున్నారు. అందుకే ఆయనను చంపేశా’ అని వీడియో రికార్డ్‌ చేయించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అక్కణ్నుంచి ఆటోలో ఝరాసంగం వైపు వెళ్లి తలను రోడ్డు పక్కన పారేశాడు. హత్య ఘటనలో రాకేశ్‌ ఒక్కడే పాల్గొన్నాడా.. లేక ఇతరులు సహకరించారా.. ప్రయాణించిన ఆటో, వీడియో తీసిందెవరు.. తదితర విషయాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చంద్రయ్యకు భార్య పూలమ్మ, కుమారుడు ప్రశాంత్‌, ముగ్గురు కూతుళ్లున్నారు. కుటుంబ సభ్యులు తలలేని మొండెం చూస్తూ గుండెలవిసేలా రోదించడం చూపరులను కలచివేసింది. హత్య విషయం తెలుసుకున్న సీఐ వెంకటేశ్‌.. ఝరాసంగం, హద్నూర్‌ ఎస్సైలు రాజేందర్‌రెడ్డి, వినయ్‌కుమార్‌తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబీకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన తల్వార్‌ కవర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జహీరాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు జహీరాబాద్‌ గ్రామీణ ఠాణాలో లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు