logo

చదివే బాధ్యత మీది.. సౌకర్యాల కల్పన నాది

‘చదివే బాధ్యత మీది.. సౌకర్యాల కల్పన బాధ్యత నాది. ఇదే మీకు నాకు మధ్య పోటీ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు విద్యార్థులతో అన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు.

Updated : 30 Mar 2023 04:20 IST

మంత్రి  హరీశ్‌రావు

నంగునూరు భారాస ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు, వేదికపై జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: ‘చదివే బాధ్యత మీది.. సౌకర్యాల కల్పన బాధ్యత నాది. ఇదే మీకు నాకు మధ్య పోటీ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు విద్యార్థులతో అన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. పట్టణంలో ఓయూ పీజీ కళాశాల అనుబంధంగా నిర్మించిన మహిళలు, పురుషుల వసతి గృహాలను బుధవారం ఓయూ ఉప కులపతి ప్రొఫెసర్‌ రవీందర్‌తో కలిసి ఆయన ప్రారంభించి, మాట్లాడారు. మీడియా ల్యాబ్‌, స్కిల్‌ సెంటర్‌ కావాలని ఎంసీజే, ఎంబీఏ విద్యార్థులు నిహారిక, సంజీవ్‌ కోరగా, త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది బీఎస్సీ అగ్రికల్చర్‌, బీబీఎస్సీ, లా, బీఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఉప కులపతి ప్రొ.రవీందర్‌ మాట్లాడుతూ.. వర్సిటీల్లో పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును అసెంబ్లీ ఆమోదించిందని, గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉండడంతో 2 వేల ఉద్యోగాల భర్తీకి ఆటంకం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ, క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు పాల సాయిరాం, పీజీ కళాశాల ప్రిన్సిపల్‌ రవినాథ్‌, కౌన్సిలర్‌ శ్రీదేవి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డా.సీహెచ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

దేశ ప్రజల సేవ మన బాధ్యత

నంగునూరు, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించిన తెరాస ఇప్పడు జాతీయ స్థాయిలో భారాసగా విస్తరిస్తోందని కార్యకర్తలందరూ సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరులో మండలస్థాయి భారాస కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ గులాబీ జెండా ఎత్తింది నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయం నుంచేనని అదే సెంటిమెంట్‌గా నంగునూరు నుంచే ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. వ్యవసాయానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు.  కాంగ్రెస్‌, భాజపా నాయకుల మాటలను నమ్మొద్దని, ఆపదలో ఆదుకొని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన భారాసకు అండగా నిలవాలని కోరారు. కార్యకర్తల మధ్య చిన్నచిన్న పొరపొచ్ఛాలుంటే కుటుంబం మాదిరిగా కలిసి మాట్లాడుకుందామని సూచించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, జిల్లా జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ మాట్లాడారు. నంగునూరు పెద్దవాగులోకి కాళేశ్వరం జలాలు వచ్చిన నేపథ్యంలో రోజాశర్మతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. రైబస మండల కన్వీనర్‌ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ ఉమ, ఏఎంసీ ఛైర్మన్‌ రాగుల సారయ్య, పీఏసీఎస్‌ ఛైర్మన్లు రమేశ్‌గౌడ్‌, మహిపాల్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు  పాల్గొన్నారు.


అదానీ, అంబానీ ఆదాయం పెంచేందుకే కేంద్రం ప్రయత్నం

సీఎం కేసీఆర్‌ తెలంగాణలో సంపద పెంచి పేద ప్రజలకు పంచుతుంటే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పేదలపై పన్నులు విధించి అదానీ, అంబానీల ఆదాయం పెంచుతోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రభుత్వం నెలకు సుమారు రూ.2000 కోట్లు వెచ్చించి నాణ్యమైన, నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తోందని తెలిపారు.  పెద్దనోట్ల రద్దుతో పేద ప్రజలకు ఇబ్బందులు తప్ప ఎలాంటి మేలు జరగలేదన్నారు. డిజిటల్‌ చెల్లింపులు అంటూ పేటీఎం, గూగుల్‌పే లాంటివి అలవాటు చేసి ఇప్పుడు వాటిపై 1.1 శాతం పన్ను విధించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని