logo

విజ్ఞానయాత్ర...విశేషాల కలబోత

భారతదేశం.. భిన్న సంస్కృతి, సంప్రదాయాల సమాహారం. ఒక్కో చోట.. ఒక్కోలా ఆచార, వ్యవహారాలు పాటిస్తుంటారు. భౌగోళిక పరిస్థితులు, ఆహార అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. ఇలాంటి ఎన్నో విశేషాలను ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా వాలంటీర్లు తెలుసుకునే అవకాశం కల్పించారు.

Updated : 26 May 2023 05:42 IST

‘యువ సంఘం’లో మన వాలంటీర్లు
న్యూస్‌టుడే, సిద్దిపేట, సంగారెడ్డి టౌన్‌

భారతదేశం.. భిన్న సంస్కృతి, సంప్రదాయాల సమాహారం. ఒక్కో చోట.. ఒక్కోలా ఆచార, వ్యవహారాలు పాటిస్తుంటారు. భౌగోళిక పరిస్థితులు, ఆహార అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. ఇలాంటి ఎన్నో విశేషాలను ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా వాలంటీర్లు తెలుసుకునే అవకాశం కల్పించారు. ఏక్‌భారత్‌ - శ్రేష్ఠ్‌ భారత్‌లో భాగంగా ఇటీవల ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో యువ సంఘం (యూత్‌ ఎక్స్ఛేంజ్‌) పేరిట కొనసాగిన ఈ విజ్ఞాన యాత్ర ద్వారా విద్యార్థులు ఆసక్తికర విషయాలు సంగ్రహించారు. రాష్ట్రం నుంచి 45 మంది ఎంపికవగా.. సిద్దిపేట, సంగారెడ్డి నుంచి ఒకరు చొప్పున విద్యార్థులు అవకాశం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా యువ విద్యార్థులను ‘న్యూస్‌టుడే’ పలకరించగా.. యాత్రా విశేషాలు, అనుభవాలను వెల్లడించారు.

సంస్కృతి చాటి..

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో యువ సంఘం పేరిట ఈ విహార, విజ్ఞాన యాత్ర ద్వారా కొనసాగింది. తద్వారా అక్కడి సంస్కృతిని పరస్పరం తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ఇటీవల 15 రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. అక్కడి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను వీక్షించి విశేషాలు తెలుసుకున్నారు. హరిద్వార్‌, రుషికేశ్‌, నానిటాల్‌ ఏరిస్‌ ఇనిస్టిట్యూషన్‌, ఐఐటీ రూర్కి, ఇతరత్రా ప్రాంతాలకు వెళ్లారు. అక్కడి ఓ గ్రామాన్ని చూశారు. వారి సంస్కృతిని తెలుసుకోవడంతో పాటు మన సంప్రదాయాలు తెలియజేశారు. శాస్త్రీయ, పేరిణి నృత్యాలు, జానపద పాటలు, వివిధ వాద్యాలను ప్రదర్శించారు. కవితలు చదివి వినిపించారు. రాకపోకలతో కలిపి మొత్తం 10 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. ప్రధానంగా ఐదు అంశాల చుట్టూ ఈ యాత్ర కొనసాగింది.

చదువుతో పాటు సమాజ సేవ

సిద్దిపేటలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బీఎస్సీ ఎఫ్‌జడ్‌సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనూజ.. ప్రథమ సంవత్సరం నుంచే ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీరుగా సేవలు అందిస్తున్నారు. ఈ శిబిరంలో ఆసక్తిగా పాల్గొన్న విద్యార్థిని పాటను ఆలపించడంతో పాటు నృత్యం చేశారు. చదువుతో పాటు సమాజ సేవ చేయడమంటే అమితాసక్తి కావడంతో ఎన్‌ఎస్‌ఎస్‌ను ఎంచుకున్నారు. ‘యాత్రలో భాగంగా శాస్త్రవేత్తను కలిసి మాట్లాడటం మరిచిపోలేనిది. ఐఐటీ రూర్కిలో రాక్‌ మ్యూజియం అద్భుతం. ప్రిన్సిపల్‌ డా. సీహెచ్‌ ప్రసాద్‌, మత్స్య, జంతుశాస్త్రాల విభాగాధిపతి డా.అయోధ్యరెడ్డి, అధ్యాపక సిబ్బంది ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తా..’ అని అనూజ చెబుతున్నారు.


ఉత్సాహపూరిత వాతావరణంలో..

ప్రశంసాపత్రం అందుకుంటూ..

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థి రంజిత్‌రెడ్డి.. ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగిన ఈ యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ కళలు, సంప్రదాయాలను ప్రదర్శించే అవకాశాన్ని దక్కించుకున్నారు. వేణువు, డప్పు వాద్యాల ద్వారా ప్రదర్శన ఇచ్చారు. ‘స్వాతంత్య్రం వచ్చాక దేశం ఎలా అభివృద్ధి చెందిందనేది స్పష్టమైంది. స్టీలు, సిమెంట్‌ పరిశ్రమలను సందర్శించాం. నానిటాల్‌లోని ఆర్యభట్ట ఇనిస్టిట్యూట్‌ను సందర్శించి శాస్త్రవేత్తలతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకున్నాం. ఐఐటీ రూర్కిలో సూపర్‌ కంప్యూటర్‌, అంకుర సంస్థల ఆవిష్కరణలను పరిశీలించాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలంగాణ కళలు, సంప్రదాయాలపై ప్రదర్శనలు ఇచ్చాం.’ అని రంజిత్‌రెడ్డి వివరించారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని