logo

దివ్యాంగుల రిజర్వేషన్‌ ఏడు శాతానికి పెంచాలి: ఎమ్మార్పీఎస్‌

ప్రస్తుతం దివ్యాంగులకు ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్‌ ఏడు శాతానికి పెంచాలని ఎమ్మార్పీస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. పాలనాధికారి కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.

Published : 09 Jun 2023 01:56 IST

ధర్నాలో మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: ప్రస్తుతం దివ్యాంగులకు ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్‌ ఏడు శాతానికి పెంచాలని ఎమ్మార్పీస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. పాలనాధికారి కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోస్టర్‌ పాయింట్లను 56 నుంచి 10లోపు కుదించి, వివిధ రకాల సంక్షేమ పథకాల్లో, రెండు పడకల ఇళ్లలో మొదటి ప్రాధాన్యం కల్పించాలన్నారు. అంత్యోదయ కార్డులు జారీ చేసి నెలకు 35 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలన్నారు. దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాలని కోరారు.కార్యక్రమంలో నాయకులు బాల్‌రాజు, దివ్యాంగుల హక్కుల పోరాట కమిటీ జిల్లా అధ్యక్షుడు పాండు, ప్రధానకార్యదర్శి సంజీవులు, కోశాధికారి కుమార్‌ పాల్గొన్నారు.

ఉత్సవాల పేరిట ఖర్చు ఆపాలి

శివ్వంపేట, న్యూస్‌టుడే: అనాథలు, మానసిక దివ్యాంగుల సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని, ఇప్పటివరకు అమలుకు నోచుకోవడంలేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం శివ్వంపేట మండలం మగ్దుంపూర్‌ బేతని సంరక్షణ అనాథ ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆశ్రమ నిర్వాహకుడు సజీవర్గీస్‌ సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనాథల సంరక్షణకు ప్రత్యేకంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరిట  రూ.వందల కోట్లు ఖర్చు చేసి  బిర్యానీ పెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు మరోసారి హామీ గుర్తు చేసేందుకు ఈనెల 23వ తేదీన అన్ని జిల్లాలో ‘అనాథలను ఆదుకోండి.. పెద్ద మనుసు చాటుకోండి’ దీక్ష చేపడుతున్నామని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు యాదగిరి, చెట్లపల్లి యాదగిరి మాదిగ, కట్ట శంకర్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని