logo

మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం

మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చిందని, నీటివనరులు జలాలతో కళకళ లాడుతున్నాయని ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 09 Jun 2023 01:56 IST

గంగమ్మకు పూజలు చేస్తున్న పద్మా దేవేందర్‌రెడ్డి తదితరులు

మెదక్‌ రూరల్‌, న్యూస్‌టుడే: మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చిందని, నీటివనరులు జలాలతో కళకళ లాడుతున్నాయని ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండల పరిధి కొంటూర్‌ చెరువులో నీటి పారుదల శాఖ, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరూరా చెరువుల పండుగలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ..

2014కు ముందు విద్యుత్తు, నీళ్ల సమస్య ఉండేదని, ప్రత్యేక రాష్ట్రంలో పరిష్కారమయ్యాయని చెప్పారు. మిషన్‌ కాకతీయ ద్వారా మెదక్‌ నియోజకవర్గంలో 4,84 చెరువుల్లో పూడిక తీసి నీళ్లు నింపుకొంటున్నామన్నారు. పాలనాధికారి రాజర్షిషా, అధనపు పాలనాధికారి రమేష్‌, ఆర్డీవో సాయిరాం, ఎస్‌ఈ ఏశయ్య, డీఈ నాగరాజు, మెదక్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ ఛైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, ఆత్మ కమిటీ ఛైర్మన్‌ అంజాగౌడ్‌ పాల్గొన్నారు. అంతకుముందు చెరువు వద్ద ఎమ్మెల్యే, అధికారులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. చెరువు కట్టపై బతుకమ్మ ఆడారు. గంగమ్మకు పూజలు చేసి కట్ట మైసమ్మకు బోనాలు సమర్పించారు.

సమృద్ధిగా భూగర్భ జలాలు

సర్ధనలో పాల్గొన్న ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి

హవేలిఘనపూర్‌, న్యూస్‌టుడే: భారాసతోనే చెరువులకు పూర్వవైభవం వచ్చిందని సీఏం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధి సర్ధనలో నిర్వహించిన చెరువుల పండగలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిషన్‌ కాకతీయతో చెరువుల్లో పూడిక తీయడం ద్వారా నీటి సామర్థ్యంతో పాటు భూగర్భ జలాలు పెరిగాయన్నారు. అనంతరం మండల పరిధి వాడిలో సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి, మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, సర్పంచులు సుభాష్‌, యామిరెడ్డి, నాయకులు పెంటయ్య తదితరులు ఉన్నారు.


పర్యాటక కేంద్రంగా నర్సాపూర్‌ చెరువు

బతుకమ్మలతో మదన్‌రెడ్డి, సునీతారెడ్డి, ప్రతిమాసింగ్‌

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: నర్సాపూర్‌ రాయరావు చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండగ కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువు వద్ద రూ.2కోట్లతో ఆధునిక దోబీఘాట్‌ను నిర్మిస్తామని ప్రకటించారు. నర్సాపూర్‌ చెరువును ఇదివరకే ఎంతో అభివృద్ధి చేశామన్నారు. నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించి పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రణాళికలు తయారు చేయిస్తానని చెప్పారు. చెరువు పూడికతీతతో రూ.1.20 కోట్లు ప్రభుత్వానికి జమచేశామన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి మాట్లాడుతూ చెరువులో బోటింగ్‌కు ప్రతిపాదించాలన్నారు. అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ మాట్లాడుతూ.. కార్యక్రమ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు పురపాలిక వద్ద జలపందిరిని ప్రదర్శించారు. బోనాలు, బతుకమ్మలతో సందడి చేశారు. చెరువు వద్దకు ర్యాలీగా వెళ్లి మహిళలు బతుకమ్మ ఆడారు. గంగమ్మకు, కట్టమైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. జడ్పీకోఆప్షన్‌ సభ్యులు మన్సూర్‌, కమిషనర్‌ వెంకట్‌గోపాల్‌, ఉపాధ్యక్షులు నయీమొద్దీన్‌, ప్యాక్స్‌ అధ్యక్షులు రాజుయాదవ్‌, పట్టణాధ్యక్షులు భిక్షపతి, కౌన్సిలర్లు అశోక్‌గౌడ్‌, లలిత, సరిత, రాంచందర్‌ పాల్గొన్నారు.


సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ ప్రతీక

తూప్రాన్‌లో   కళాకారుల సందడి

తూప్రాన్‌, న్యూస్‌టుడే: సంస్కృతి, సంప్రదాయాలకు రాష్ట్రం ప్రతీకగా నిలుస్తోందని పాలనాధికారి రాజర్షిషా అన్నారు. గురువారం తూప్రాన్‌ డివిజన్‌ కేంద్రంలో చెరువుల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావడం సంతోషకరమన్నారు. పురపాలిక కార్యాలయం నుంచి పెద్ద చెరువు కట్ట వరకు మహిళలు, చిన్నారులు బతుకమ్మలు, బోనాలను ఊరేగించారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఫుడ్‌కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, తూప్రాన్‌ ఆర్డీవో శ్యామ్‌ప్రకాశ్‌, ఛైర్మన్‌ రవీందర్‌గౌడ్‌, వైస్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌, రైసస జిల్లా సమన్వయకర్త సలాక రాజేశ్వరశర్మ, పురపాలిక కమిషనర్‌ మోహన్‌, మేనేజర్‌ రఘువరణ్‌, పాల్గొన్నారు. తూప్రాన్‌ మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువుల వద్ద పండుగను ఘనంగా నిర్వహించారు. కట్ట మైసమ్మ ఆలయాల వద్ద పూజలు చేశారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని