logo

ఉపాధికి ప్రోత్సాహం

జిల్లాలో బీసీ రుణాల కోసం ఏటా పెద్దసంఖ్యలో యువత, వివిధ వర్గాల వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏళ్లుగా అందకపోవడంతో నిరాశ వ్యక్తమవుతోంది. గతంలో పలువురు దరఖాస్తులు చేసుకున్నా.. మంజూరు లేక ఎదురుచూపులే మిగిలాయి.

Published : 09 Jun 2023 01:56 IST

ఆర్థిక చేయూత..

సిద్దిపేట మీసేవలో దరఖాస్తుల సమర్పణకు వచ్చిన బీసీలు

న్యూస్‌టుడే, సిద్దిపేట: జిల్లాలో బీసీ రుణాల కోసం ఏటా పెద్దసంఖ్యలో యువత, వివిధ వర్గాల వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏళ్లుగా అందకపోవడంతో నిరాశ వ్యక్తమవుతోంది. గతంలో పలువురు దరఖాస్తులు చేసుకున్నా.. మంజూరు లేక ఎదురుచూపులే మిగిలాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం బీసీల్లోని చేతి, కుల వృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించడంతో ఎంతోకొంత ఊరట లభించనుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోమైపు ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు  అందే అవకాశం దృష్ట్యా అర్హుల ఎంపిక అధికార యంత్రాంగానికి ఒక సవాలుగా మారనుంది.

20 నుంచి పరిశీలన

దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఈ నెల 20 నుంచి పరిశీలన మొదలవనుంది. మండల స్థాయిలో ఎంపీడీవో, పట్టణ స్థాయిలో మున్సిపల్‌ కమిషనర్లు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగుతుంది. తదుపరి ఎంపిక ప్రక్రియను జిల్లా పాలనాధికారి నేతృత్వంలో కమిటీ చేపడుతుంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నేతృత్వంలో పాలనాధికారి.. ఈ నెల 27 నుంచి జులై 4వ తేదీ వరకు తుది జాబితాను ఆమోదిస్తారు. ఎంపిక జాబితాను విడతల వారీగా అధికారిక వెబ్‌సైట్‌ లేదా మండల, గ్రామ పంచాయతీ కార్యాలయాల ద్వారా ప్రదర్శిస్తారు. ప్రతి నెలా 15న రూ.లక్ష గ్రాంట్‌ను (చెక్కు) ఒకేసారి లబ్ధిదారుకు అందిస్తారు. సంబంధిత సొమ్ముతో నచ్చిన సామగ్రి, పరికరాల కొనుగోలు స్వేచ్ఛ లబ్ధిదారులదే. యూనిట్ల పంపిణీ అనంతరం మండలాలకు నియమితులైన ప్రత్యేక అధికారులు, ఎంపీడీవో, బృందం పర్యవేక్షిస్తారు. ఉపాధి పొందుతున్న తీరును ఫొటోల రూపంలో వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తారు. రెండేళ్ల పాటు పర్యవేక్షణ జరగనుంది.

బీసీల్లోని చేతి, కుల వృత్తిదారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఏళ్లుగా రుణ సదుపాయం పొందాలని ఆశించిన వారికి ప్రభుత్వం సాయం రూపంలో అండగా నిలుస్తామనే భరోసాను కల్పిస్తోంది. రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించిన తరుణంలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు జిల్లాలో పెద్దసంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల 6వ తేదీన దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. 20వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్నుగా నిలువనున్న ఈ పథకం విశేషాలపై ‘న్యూస్‌టుడే’ కథనం..


చేతి, కుల వృత్తిదారులకు సదవకాశం

అర్హతలు, కావాల్సిన పత్రాలు

* 18 - 55 ఏళ్ల వయసుండాలి.

* వార్షిక ఆదాయం.. గ్రామీణ ప్రాంతమైతే రూ.1.50 లక్షలు, పట్టణాలు - రూ.2లక్షలు.

* గడిచిన ఐదేళ్లలో రూ.50 వేలు, ఆపై రుణాలు తీసుకుంటే ఈ పథకానికి అనర్హులు.

* ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆడ, మగ ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు.

* రేషన్‌, ఆధార్‌, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా ప్రతులు, ఫొటోతో దరఖాస్తులు సమర్పించాలి. రేషన్‌ కార్డులో సంబంధిత అభ్యర్థి పేరు తప్పనిసరి ఉండాలి.

* ఆన్‌లైన్‌ కేంద్రాల్లో లేదా నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. tsobmmsbc.cgg.gov.inవెబ్‌సైట్‌ను సందర్శించాలి.


సాంకేతిక సమస్యలు

గతంలో బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందకున్నా ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. లబ్ధి పొందిన వారి మాట అటుంచితే.. అసలు ఎలాంటి లబ్ధి పొందని వారు ఆందోళనకు గురవుతున్నారు. రెండు రోజులుగా ఆన్‌లైన్‌ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందని వారికి ఆన్‌లైన్‌లో నమోదుకు మార్గం సుగమం చేయాలని పలువురు కోరుతున్నారు. సర్వర్‌ మొరాయిస్తోంది. ఒక్కో దరఖాస్తు నమోదు పూర్తయ్యేందుకు గంట సమయం పడుతోంది. కొన్నిసార్లు ప్రక్రియ ముందడుగు పడటం లేదు. ఆయా సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. దరఖాస్తు సమర్పణ సమయంలో పాన్‌కార్డు నంబరు నమోదు చేయాలని సూచించడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు పెదవి విరుస్తున్నారు. చాలీచాలని సొమ్ముతో జీవించే తాము ఆ కార్డు ఎలా పొందేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా బీసీ ఇన్‌ఛార్జి అభివృద్ధి అధికారి మురళిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. మూడు రోజుల్లో 250 దరఖాస్తులు అందాయన్నారు. సాంకేతిక సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

మినహాయింపులు ఇవ్వాలి: ఎం. శ్రీనివాస్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నాయీబ్రాహ్మణ సంఘం

బీసీల్లోని చేతి, కుల వృత్తుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహకారం అందించడం మంచి విషయమే. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇదే క్రమంలో కొన్ని మినహాయింపు ఇవ్వాలి. దరఖాస్తు గడువు త్వరగా ముగిసే అవకాశం ఉన్న దృష్ట్యా పలువురు ఆందోళనకు గురవుతున్నారు. ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు త్వరగా అందుతాయో.. లేదోనని పలువురు వాపోతున్నారు. త్వరితగతిన ఆమోదం తెలుపడంతో పాటు గడువును పొడిగించాలి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని