logo

పంట మార్పిడితో అధిక దిగుబడి: మంత్రి

వానాకాలం, యాసంగి పంటలు చేతికొచ్చిన తరువాత అకాల వర్షం, వడగళ్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వరి పంట సాగు కాలాన్ని నెల ముందుకు తీసుకురావడంతో ఆ ఇబ్బందులు దూరమవుతాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 09 Jun 2023 01:56 IST

స్టాళ్ల వద్ద తెలుసుకుంటున్న హరీశ్‌రావు

వంటకాలు ప్రదర్శిస్తున్న మహిళలు

సిద్దిపేట: వానాకాలం, యాసంగి పంటలు చేతికొచ్చిన తరువాత అకాల వర్షం, వడగళ్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వరి పంట సాగు కాలాన్ని నెల ముందుకు తీసుకురావడంతో ఆ ఇబ్బందులు దూరమవుతాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ తన వ్యవసాయ పొలంలో వెదజల్లే పద్ధతి ద్వారా పంటలు సాగు చేస్తున్నారని, దీంతో సమయం, డబ్బు ఆదా అవడంతో పాటు సత్ఫలితాలు సాధిస్తున్నట్లు వివరించారు. గురువారం నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లోని రైతులు, జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. మృగశిరలోనే రైతులంతా వరి నార్లు పూర్తి చేయాలన్నారు. జులై 15వ తేదీలోపు నాట్లు పూర్తి చేయాలని, తద్వారా అక్టోబరు చివరి వరకు కోతలు పూర్తవుతాయన్నారు. నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటకాలాన్ని ముందుకు తేవడం ద్వారా పొందుతున్న ప్రయోజనాలను వివరించారు. రంగనాయకసాగర్‌ వద్ద ఆయిల్‌పామ్‌ నర్సరీ కొనసాగుతోందని, నంగునూరు మండలం నర్మెటలో పరిశ్రమను అందుబాటులోకి తెస్తామన్నారు. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించే వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. శనగ, బబ్బెర, మిను ము, ఉలువలు, పెసర పంటల సాగు వైపు మళ్లాలని కోరా రు. అనంతరం సిద్దిపేటలోని ప్రయాణ ప్రాంగణంలో జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, పోలీసు కమిషనర్‌ శ్వేత, అదనపు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, డీపీవో దేవకిదేవి, బల్దియా అధ్యక్షురాలు మంజులతో కలిసి సిలికాన్‌ కప్‌లు, వస్త్ర నాప్కిన్ల విక్రయ కేంద్రాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు.

నంగునూరు, న్యూస్‌టుడే: దశాబ్దాల కాలం నుంచి చెరువులకు పట్టించిన చిలుమును మిషన్‌ కాకతీయ పథకం ద్వారా తొలగించిన నేత సీఏం కేసీఆర్‌ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం మండల పరిధి రాజగోపాలపేటలో చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు. నాడు ఆంధ్ర నుంచి చేపలు తెలంగాకు వచ్చేవని నేడు తెలంగాణ నుంచి పక్క రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సారయ్య, మాజీ ఎంపీపీ శ్రీకాంతరెడ్డి తదతరులు పాల్గొన్నారు.

నోరూరించిన వంటలు

సిద్దిపేట టౌన్‌, హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: సిద్దిపేట కోమటి చెంతన ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ గురువారం సాయంత్రం ప్రారంభమైంది. వివిధ రకాల చేపల, రొయ్యలతో చేసిన ఆహారపదార్థాలు మాంసప్రియులను నోరూరించాయి. పట్టణవాసులు పెద్దసంఖ్యలో తిలకించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు హాజరై ప్రారంభించారు. ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌కు సరైన ఏర్పాట్లు చేయకపోవటంపై నిర్వాహకులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. తీగల వంతెన వద్ద విద్యుద్దీపాలు సరిగా వెలగకపోవటంపై టూరిజం మేనేజర్‌ రవీంద్రాచారిని ప్రశ్నించారు. దుకాణాల వద్ద వ్యర్థాలను స్వయంగా మంత్రి ఏరి చెత్త బుట్టలో వేశారు. పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కణ్ణుంచి నేరుగా ఫిష్‌ ఫుడ్‌ స్టాళ్ల వద్దకు వెళ్తూ మధ్యలో ఓ దుకాణం ముందు పడి ఉన్న వ్యర్థాలను గమనించి స్వయంగా తీసి చెత్తబుట్టలో వేశారు. అనంతరం ఫిష్‌ ఫుడ్‌ స్టాళ్ల వద్దకు వెళ్లగా సంబంధిత వివరాలను తెలిపే ఫ్లెక్సీ, లైటింగ్‌ లేకపోవటంపై మత్స్యశాఖ ఏడీ మల్లేశంపై మండిపడ్డారు. వేదిక వద్దకు చేరుకుని హాజరైన వారికి నమస్కరించి కార్యక్రమాన్ని కొనసాగించాలంటూ నిర్వాహకులకు సూచించి వెళ్లిపోయారు. నేడు శుక్రవారం హుస్నాబాద్‌, కోహెడ మండలాల్లో మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని