logo

ఆపసోపాల మధ్య ధాన్యం అమ్మకాలు

యాసంగిలో చేతికొచ్చిన ధాన్యం విక్రయానికి అన్నదాతలు ఆపసోపాలు పడ్డారు. ఓ వైపు అకాల వర్షాలు.. మరో వైపు తూకం వేసినా మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది.

Published : 10 Jun 2023 01:47 IST

ఎట్టకేలకు తుది దశకు చేరుకున్న వైనం

మిల్లు వద్ద నిలిచిన వాహనాలు

శివ్వంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో 16 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇప్పటి వరకు 1.40 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించగా, మరో పది వేల క్వింటాళ్ల మేర మిగిలి ఉంది. శివ్వంపేట, పెద్దగొట్టిముక్ల, కొత్తపేట తదితర గ్రామాల్లో కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఐకేపీ ఆధ్వర్యంలో ఏడు కేంద్రాలు మూసివేయగా, 20 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు.

న్యూస్‌టుడే, మెదక్‌, శివ్వంపేట, చిలప్‌చెడ్‌: యాసంగిలో చేతికొచ్చిన ధాన్యం విక్రయానికి అన్నదాతలు ఆపసోపాలు పడ్డారు. ఓ వైపు అకాల వర్షాలు.. మరో వైపు తూకం వేసినా మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. లారీల కొరతతో రైతులు చాలా చోట్ల రోడ్డెక్కారు. అధికార యంత్రాంగం చెమటోడ్చి వాహనాలు సమకూర్చినా ఖాళీ చేసేందుకు రోజుల కొద్ది వేచి చూడక తప్పలేదు. మరో వైపు బస్తాకు అదనంగా వసూలు చేశారు. ఈ క్రమంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే సగం కేంద్రాలు మూతపడగా, నాలుగైదు రోజుల్లో ప్రక్రియ పూర్తికి దృష్టి సారించారు.
మెతుకుసీమలో వ్యవసాయమే అత్యధికులకు ఆధారం. 3.51 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు అధికారులు కార్యాచరణ రూపొందించి, అవసరమైన యంత్రాలు, సామగ్రి సిద్ధం చేసి కేంద్రాలను అందుబాటులో తీసుకొచ్చారు. 407 కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరణ షురూచేశారు. ప్రక్రియ మొదలైనప్పటి నుంచి సమస్యలు ఎదురయ్యాయి.  

తూప్రాన్‌లో లారీలు ఆపుతున్న అధికారులు

అదనంగా తూకం..

పలు కేంద్రాల్లో ధాన్యాన్ని 40 కిలోల కంటే అదనంగా మూడు కిలోల వరకు తూకం వేశారు. వర్షాలతో తడిసి ముద్దవడంతో నష్టపోతామని మిల్లర్లు తూకం ఎక్కువ వేయించారు. కౌడిపల్లి, శివ్వంపేట, మనోహరాబాద్‌ తదితర ప్రాంతాల్లో కాంటాల నిర్వాహకులతో మిల్లర్లు కుమ్మకై తక్కువ తూకం వచ్చేలా చేశారు. అధికారులు తనిఖీ చేసి కాంటాలను సైతం మూసివేయించారు.

లారీల కొరత..

నర్సాపూర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా లారీల కొరత వేధించింది. అన్ని మండలాల్లో ధర్నాలు జరిగాయి. తూప్రాన్‌, నర్సాపూర్‌ రెవెన్యూ, పోలీసులు అధికారులు రోడ్డెక్కి లారీలను ఆపి నచ్చజెప్పి కేంద్రాలకు పంపించారు. తారీ బస్తాలను మిల్లులకు తీసుకెళ్తే అక్కడ హమాలీలు లేక దించుకోవడంలో జాప్యం చోటుచేసుకుంది. లారీలు రాకపోవడం.. రోజుల తరబడి ధాన్యం కేంద్రాల్లోనే ఉండటం, సంచుల బరువు తగ్గడం అన్నదాత ఆగ్రహానికి గురిచేసింది.


రూ.567.40 కోట్లు

జిల్లాలో ఇప్పటి వరకు 62,189 మంది నుంచి రూ.567.40 కోట్ల విలువైన 2,75,434 టన్నుల (78.25 శాతం) ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 2,66,079 టన్నులు మిల్లులకు తరలించారు. 2.33 లక్షల టన్నులకు సంబంధించి వివరాలు ట్యాబ్‌లో నమోదు చేశారు. ఇంకా 76,556 టన్నుల మేర సేకరించాల్సి ఉంది. పలు మండలాల్లో ధాన్యం సేకరణ పూర్తవగా, ఇంకా ఆయా చిలప్‌చెడ్‌, తూప్రాన్‌, మనోహరాబాద్‌, నర్సాపూర్‌, మెదక్‌, హవేలిఘనపూర్‌ తదితర మండలాల్లో కొనుగోళ్లు జరగాల్సి ఉంది. ఈసారి సైతం ధాన్యం నిల్వకు ఇబ్బందులు తలెత్తాయి. మెదక్‌ మండలం ఎన్డీఎస్‌ఎల్‌ గోదాములోనూ నిల్వ చేశారు. మిల్లుల్లో స్థలాభావం కారణంగా ఇతర జిల్లాలకూ తరలించారు. సరిపడా గోదాంలు లేకపోవడంతో ఈ సమస్య ఎదురైంది.


నాలుగైదు రోజుల్లో పూర్తి..

- శ్రీనివాస్‌, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి

నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇప్పటి వరకు 214 కేంద్రాలను మూసి వేశాం. లారీలతో పాటు ట్రాక్టర్లలో సైతం తరలిస్తున్నాం. మిల్లుల వద్ద ఎప్పటికప్పుడు వాహనాలను ఖాళీ చేసి కేంద్రాలకు పంపించాం.
చిలప్‌చెడ్‌ మండలంలో 1,68,147 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 1,42,453 క్వింటాళ్లు సేకరించారు. ఇంకా 44,522 క్వింటాళ్లు సేకరించాల్సి ఉంది. లారీలు సమస్య వేధిస్తోంది. దీంతో బస్తాల్లో తేమశాతం పడిపోయి బరువు తగ్గుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని