logo

నకిలీ విత్తనాల రాకెట్‌ గుట్టురట్టు

ప్రముఖ కంపెనీల పేర్లతో ప్యాకెట్లు రూపొందించి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠాల గుట్టును సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు బట్టబయలు చేశారు.

Published : 10 Jun 2023 01:47 IST

3 గోదాముల్లో 3.35 టన్నులు స్వాధీనం 
10 మంది నిందితుల అరెస్టు

నకిలీ విత్తనాలను పరిశీలిస్తున్న సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ కంపెనీల పేర్లతో ప్యాకెట్లు రూపొందించి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠాల గుట్టును సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్‌వోటీ, మేడ్చల్‌, చేవెళ్ల పోలీసులు వ్యవసాయశాఖతో సంయుక్తంగా సోదాలు నిర్వహించి మూడు గోదాముల్లో సాగుతున్న నకిలీ దందాను గుర్తించారు. 3.35 టన్నుల నకిలీ, నిషేధిత పత్తి విత్తనాలు, ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఉన్న 14,850 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.95 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వేర్వేరు కేసుల్లో 10 మందిని అరెస్టు చేశారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర శుక్రవారం వివరాలు వెల్లడించారు.. నిర్మల్‌ జిల్లా భైంసా నివాసి అబ్దుల్‌ రజాక్‌(50) పత్తి వ్యాపారి. వ్యాపార భాగస్వాములు జాని, హరీశ్‌(26), శ్రీనివాస్‌(40), ఐలయ్య(60), దళారి మల్లికార్జున్‌(36)లతో కలసి దందా సాగిస్తున్నాడు. గుజరాత్‌కు చెందిన కమలేష్‌ పటేల్‌తో రజాక్‌కు పరిచయాలున్నాయి. ఆ రాష్ట్రంలో జన్యుపరీక్షలో విఫలమైన బీజీ3/హెచ్‌టీ పత్తి విత్తనాలను తెలంగాణకు సరఫరా చేసి లాభాలు పొందాలనుకున్నారు. అక్కడి నుంచి మేడ్చల్‌ రైల్వేస్టేషన్‌ రోడ్‌లో ఉన్న గోదాముకు 2.53 టన్నుల విత్తనాలు చేరవేసి నిల్వచేశారు. ప్రముఖ కంపెనీల ప్యాకెట్లు రూపొందించి వాటిలో నకిలీ విత్తనాలు నింపారు. తక్కువ ధరకు రైతులకు విక్రయించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన కొత్త తురకా ఎలీషా అలియాస్‌ బాషా(43) విత్తన వ్యాపారి. కర్నూలులో గౌతమి సీడ్స్‌ డీలర్‌గా ఉన్నాడు. ఏపీ, తెలంగాణల్లోని రైతుల నుంచి ఫౌండేషన్‌ సీడ్స్‌ సేకరిస్తాడు. సాగు సమయంలో వారికే ప్రముఖ కంపెనీల పేర్లతో పత్తి విత్తనాలు విక్రయిస్తాడు. సేకరించిన పత్తి నుంచి జిన్నింగ్‌ మిల్లుల ద్వారా విత్తనాలు వేరు చేసి నిల్వ చేస్తాడు. వాటికే రసాయనాలు పూసేవాడు. జన్యు పరీక్షలో విఫలమైన నిషేధిత విత్తనాలకు వాటిని కలిపి ప్యాకెట్లలో నింపి రైతులను బురిడీ కొట్టిస్తున్నాడు. ఈ ఏడాది గౌతమీ సీడ్స్‌ నుంచి 5 టన్నుల విత్తనాలు కొనుగోలు చేశాడు. వీటిలో జన్యుపరీక్షలో విఫలమైన 800 కిలోల పత్తివిత్తనాలున్నాయి. వీటిని మార్కెట్‌లో విక్రయించకూడదనే నిబంధనలున్నా గోదాములో నిల్వచేశాడు. సీజన్‌కు ముందే విత్తనాలను చేవెళ్ల శివార్లకు తరలించేందుకు పథకం వేశాడు. ప్లాస్టిక్‌/పాలిథీన్‌ ప్యాకెట్‌ తయారీ సంస్థల నిర్వాహకులు వి.రాజు(38), టి.వెంకటేష్‌(53) బోడుప్పల్‌, ఎస్‌.వేణుకుమార్‌(42) సూర్యాపేట జిల్లా, కె.మల్లేష్‌(42) వికారాబాద్‌, బాబూరావు, రోశయ్యలకు డబ్బు ఆశచూపి నూజివీడ్‌ సీడ్స్‌, రాజా-430, విన్నర్‌-4700, ప్రభాత్‌ సీడ్స్‌-పీసీహెచ్‌-9620, బీటీ-2-6300, ట్యాగ్‌సీడ్స్‌-జై జగదాంబ బీజీ-2 -620, లామినర్‌ సీడ్స్‌- ఒసియా 630 కంపెనీల ప్యాకెట్లను రూపొందించారు. నకిలీ విత్తనాలను వాటిలో నింపి చేవెళ్ల రైతులకు చేరవేసేందుకు సిద్ధమైన సమయంలో పోలీసులు దాడి చేశారు. వికారాబాద్‌ జిల్లాకు చెందిన రైతు మల్లయ్య(42) పల్లవి సీడ్స్‌ కంపెనీ పేరుతో ఈజీ-3/హెచ్‌టీ పత్తివిత్తనాలు ఏపీ గుంటూరు జిల్లాకు చెందిన రోశయ్యకు సరఫరా చేస్తుంటాడు. అక్కడ ఒక్కో ప్యాకెట్‌ను రూ.వెయ్యికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. షాద్‌నగర్‌ మార్గంలోని హోటల్‌ వద్ద వీరి నుంచి చేవెళ్ల పోలీసులు 93 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 15 మంది నిందితుల్లో రజాక్‌, మల్లికార్జున, శ్రీనివాస్‌, హరీశ్‌, అబ్దుల్‌రఫీ, ఎలీషా, వి.రాజు, టి.వెంకటేష్‌, ఎస్‌.వేణుకుమార్‌, కె.మల్లయ్యలను అరెస్టు చేశారు. ప్యాకెట్లపై ఎలాంటి అనుమానం వచ్చినా రైతువేదికలు, వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని