logo

చేరికల కళ

ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతోంది. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇచ్చింది. ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు.

Published : 10 Jun 2023 01:47 IST

సర్కారు బడుల్లో..ఒకటో తరగతిలో 4,543 మంది విద్యార్థులు
 రాష్ట్రంలో తృతీయ స్థానం

పోతిరెడ్డిపల్లి జడ్పీ పాఠశాలలో ప్రైవేట్‌ నుంచి చేరిన విద్యార్థికి ప్రవేశ పత్రం అందజేస్తున్న ఉపాధ్యాయుడు

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతోంది. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇచ్చింది. ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ప్రైవేట్‌ బడుల నుంచీ పిల్లలు సర్కారు విద్యాలయాల్లో చేరుతున్నారు. ఒకటో తరగతి ప్రవేశాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం సాధించిన నేపథ్యంలో కథనం.

మొత్తం 6,099 మంది

జిల్లాలో మొత్తం 1248 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. జున్‌ 3 నుంచి ప్రారంభమైన అడ్మిషన్ల ప్రక్రియలో ఇప్పటి వరకు ప్రభుత్వ బడుల్లో అన్ని తరగతులకు కలిపి 6,099 మంది విద్యార్థులు చేరారు. వీరిలో 1వ తరగతిలో చేరినవారు 4,543 మంది. 1,556 మంది విద్యార్థులు వివిధ తరగతులకు ప్రైవేట్‌ పాఠశాలల నుంచి వచ్చారు. ఈ నెలాఖరు వరకు మరికొంత మంది విద్యార్థులు చేరే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రైవేటులో రూ.వేలల్లో ఫీజులు చెల్లించలేని వారు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. సంగారెడ్డే కాకుండా జహీరాబాద్‌, సదాశివపేట, పటాన్‌చెరు, రామచంద్రాపురం, జోగిపేటలో ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ఎక్కువ మంది ప్రభుత్వ బడులకు మళ్లుతున్నారు. ఒకటో తరగతి విద్యార్థుల ప్రవేశాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం దక్కించుకుందని అధికారులు తెలిపారు.


తల్లిదండ్రులకు నమ్మకం కలిగిస్తున్నాం

- వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలతో పాటు యూనిఫాం, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తున్నాం. ఈ ఏడాది నుంచి రాత పుస్తకాలు కూడా పంపిణీ చేస్తున్నాం. 8వ తరగతి చదివే వారికి ఎన్‌ఎంఎంఎస్‌ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పది పాసైన విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో సీటు దక్కించుకోవచ్చు. ఇలాంటి సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని