logo

జడ్పీ సమావేశం.. గరంగరం

జడ్పీ స్థాయీ సంఘాల సమీక్ష సమావేశాలు లెక్కలేవా.. తమషా చేస్తున్నారా .. మీకేమైనా పెద్ద కొమ్ములు వచ్చాయా.. అంటూ ప్రభుత్వ గురుకుల పాఠశాలల....

Published : 05 Dec 2021 03:19 IST

గైర్హాజరైన అధికారులపై ఛైర్మన్‌ ఆగ్రహం

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి

నల్గొండ జిల్లాపరిషత్‌, న్యూస్‌టుడే: జడ్పీ స్థాయీ సంఘాల సమీక్ష సమావేశాలు లెక్కలేవా.. తమషా చేస్తున్నారా .. మీకేమైనా పెద్ద కొమ్ములు వచ్చాయా.. అంటూ ప్రభుత్వ గురుకుల పాఠశాలల ఉన్నతాధికారులపై జిల్లాపరిషత్తు ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక జిల్లాపరిషత్తు కార్యాలయ సమావేశం మందిరంలో జరిగిన స్థాయీ సంఘాల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. బీసీ గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా అధికారిణి సమావేశానికి హాజరు కాకుండా దిగువ స్థాయీ అధికారిని పంపించడంతో ఛైర్మన్‌  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్‌ కూడా ఎత్తడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గురుకులాల్లో ఏంజరుగుతోందో మాకు తెలియాదా.. సమావేశాలు అంటే గౌరవం లేదా మీకు అంటూ అధికారులను మందలించారు. గురుకులాల్లో సీట్లు అమ్ముకుంటూ మొఖం చాటేయడం తంతుగా మారుతోంది.. ఇక్కడా సందించే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటారని మండిపడ్డారు. సమావేశాలకు హాజరు కాని అధికారులపై కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని జడ్పీ సీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఓమిక్రాన్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. బూస్టర్‌ డోస్‌ ఎప్పుడు ఇస్తారో కూడా వివరించాలని ఆదేశించారు. ఆరుతడి పంటల మద్దతు ధరలను ప్రజలకు తెలిపి వాటి సాగు పెంచే విధంగా కృషి చేయాలన్నారు. సన్నరకం ధాన్యం కొనుగోలు చేయడానికి జిల్లాలో మిల్లింగ్‌ కెపాసిటీ ఎంత ఉందని, సన్నధాన్యం కొనుగోలు పరిస్థితితులపై సమాధానం చెప్పాలన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా సన్నరకం ధాన్యం సేకరించేందుకు మిల్లర్లు సన్నద్ధంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జడ్పీ వైస్‌ఛైర్మన్‌ ఇరిగి పెద్దులు, సీఈవో వీరబ్రహ్మాచారి, డిప్యూటీ సీఈవో కాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

రహస్య  సమావేశం  
నల్గొండ జిల్లాపరిషత్‌: నల్గొండ జిల్లాపరిషత్తు ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి ఛాంబరులో తెరాస ప్రజాప్రతినిధులు శనివారం రహస్య సమావేశం నిర్వహించారు. జడ్పీ స్థాయీ సంఘాల సమావేశం ముగింపు దశకు చేరగానే ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డితోపాటు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి కోటిరెడ్డి జిల్లాపరిషత్తు కార్యాలయానికి వచ్చారు. సమావేశం ముగించుకొని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి ఛాంబరులోకి వెళ్లి స్థాయీ సంఘాల సమావేశాలకు హాజరైన తెరాస జడ్పీటీసీ సభ్యులతో రహస్య మంతనాలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని