logo

ఉరేసుకుని వివాహిత బలవన్మరణం

చీరతో ఉరివేసుకుని వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం నేరేడుచర్ల మండలం ముకుందాపురంలో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కుమార్తె మంగమ్మ (38)కు దాచారం గ్రామానికి చెందిన గొడ్డేటి వెంకన్నకు చాలా ఏళ్ల కిందట వివాహమైంది.

Published : 25 Jan 2022 05:25 IST

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: చీరతో ఉరివేసుకుని వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం నేరేడుచర్ల మండలం ముకుందాపురంలో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కుమార్తె మంగమ్మ (38)కు దాచారం గ్రామానికి చెందిన గొడ్డేటి వెంకన్నకు చాలా ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కూతురు సంతానం. భర్త మాజీ ఎంపీటీసీ సభ్యుడు. మంగమ్మ తల్లి మల్లమ్మ జ్వరం వస్తుండటంతో చూసేందుకు కూతురితో కలిసి ముకుందాపురంలోని ఇంటికి వచ్చింది. తర్వాత భర్త సైతం వచ్చారు. మధ్యాహ్నం తర్వాత భర్త, కూతురు దాచారం వెళ్లిపోయారు. రాత్రి తల్లికూతుళ్లు కలిసి భోజనం చేసి వేర్వేరు గదుల్లో నిద్రించారు. సోమవారం ఉదయం నిద్ర లేచేసరికి కూతురు మంగమ్మ ఉరి వేసుకుని మరణించి కనిపించింది. ఆమె హైదరాబాద్‌లోని కుమారులకు, మృతురాలి భర్త వెంకన్నకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహన్ని శవ పరీక్షకు తరలించారు. మృతురాలి సోదరుడు వెంకన్న తన చెల్లెలు మంగమ్మ కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కుటుంబ కలహాలతో మరొకరు..
మద్దిరాల: ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన పోలుమళ్లలో సోమవారం జరిగింది. స్థానికులు, ఏఎస్సై నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లకు చెందిన పొడుపుగంటి బాలరాజు(32)కు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమళ్లకు చెందిన ఉమతో పదేళ్ల క్రితం వివాహమైంది. బాలరాజు మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడుతుండటంతో ఆమె పోలుమళ్లకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. బాలరాజు సైతం ఐదు నెలలుగా పోలుమళ్లలో భార్యతో ఉంటూ ఆదివారం ఆమెతో గొడవపడ్డారు. ఉమ పుట్టింటికి వెళ్లిపోయారు. మనస్తాపానికి గురైన బాలరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయారు. అతడికి ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఏఎస్సై నాగయ్య తెలిపారు.

వివాహితపై అత్యాచార యత్నం
కేతేపల్లి, న్యూస్‌టుడే: మండలంలో ఓ వివాహిత(26)పై అత్యాచార యత్నం, వేధింపులకు గురి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన వివాహితపై ఈ నెల 18న అదే గ్రామానికి చెందిన కీర్తి వెంకన్న అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని కేతేపల్లి ఎస్సై ఎం.అనిల్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఈ వివాహితను ఐదేళ్ల నుంచి నిందితుడు వేధింపులకు గురి చేస్తున్నాడని ఎస్సై వివరించారు. ఈనె 18న ఊరి శివారులో ఉన్న ఓ రైతు పొలం పనులకు వెళ్లిన తనను వెంబడిస్తూ అత్యాచారం చేసేందుకు యత్నించాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై అత్యాచార యత్నం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. ఘటనకు సంబంధించి గ్రామంలో నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, శాలిగౌరారం సీఐ రాఘవరావు విచారణ నిర్వహించారని ఎస్సై వివరించారు. తన భార్యను తరచుగా వేధిస్తున్నాడని 2016 సంవత్సరంలో బాధితురాలి భర్త ప్రస్తుత కేసులో నిందితుడైన వెంకన్నపై హత్యా ప్రయత్నం చేశాడని గతంలో కేసు నమోదైందని ఎస్సై వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని