logo

రహదారి ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతిచెందిన వారిలో ఓ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉన్నారు.

Published : 26 Jan 2022 04:17 IST

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతిచెందిన వారిలో ఓ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉన్నారు.


ద్విచక్రవాహనం అదుపు తప్పి.. విభాగిని మధ్యలో పడి

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం శివారులో జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వెల్పూరు గ్రామానికి చెందిన చింతపల్లి వెంకట సతీశ్‌(28) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి వెంకట సతీశ్‌ రావులపాలెంలోని అమ్మమ్మ ఇంటి నుంచి హైదరాబాద్‌కు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయానికి దండుమల్కాపురానికి చేరుకున్నారు. ఈ సమయంలో వెంకటసతీశ్‌ ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో కిందపడి విభాగిని మధ్యలో పడి చనిపోయారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంకటసతీశ్‌ మృతదేహానికి చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని సోదరుడు రవికృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై బి.సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


గుర్తు తెలియని వాహనం ఢీకొని..

తిప్పర్తి: మండలంలోని అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సిలార్మియాగూడెం గ్రామానికి చెందిన జేజాల వెంకట్‌రెడ్డి(42) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఉదయం నడుచుకుంటూ వెళుతుండగా మిర్యాలగూడ నుంచి నల్గొండ వైపు వెళుతున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకట్‌రెడ్డికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.


సైకిల్‌పై వెళ్తుండగా...

సూర్యాపేట నేరవిభాగం: ఆటో వెనుక నుంచి ఢీకొట్టడంలో సైకిల్‌పై వెళ్తున్న వృద్ధుడు మృతిచెందిన ఘటన సూర్యాపేటలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మిగడ్డకు చెందిన పానుగంటి వెంకట నర్సింహారావు (59) మంగళవారం ఖమ్మం క్రాస్‌రోడ్డు నుంచి జమ్మిగడ్డ క్రాస్‌రోడ్డు వైపునకు సర్వీసు రహదారిపై సైకిల్‌పై వెళ్తున్నారు. అదే సమయంలో ఆటో డ్రైవర్‌ అతివేగంగా, అజాగ్రత్తగా నర్సింహారావు సైకిల్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.


కారు ఢీకొని ...

చివ్వెంల: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందిన ఘటన వల్లభాపురం స్టేజీ వద్ద హైదరాబాద్‌- విజయవాడ రహదారిపై మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లభాపురానికి చెందిన యాట వెంకటయ్య (65) స్టేజీ వద్ద రహదారి దాటుతుండగా విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న గుర్తు తెలియని కారు అతివేగంగా ఢీకొనగా అతడు అక్కడికక్కడే మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఇబ్రహీం తెలిపారు.


ట్రాక్టర్‌ బోల్తా పడి..

బండిగారి విక్రమ్‌

వలిగొండ: ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి యువకుడు దుర్మరణం చెందిన ఘటన మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగరాజుపల్లి గ్రామానికి చెందిన బండిగారి యాదగిరి, పద్మ దంపతుల పెద్ద కుమారుడు విక్రమ్‌ (22) రామన్నపేట ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. విక్రమ్‌ ట్రాక్టర్‌ ఇంజిన్‌తో వలిగొండ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్రమాదవశాత్తు బోల్తా పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మరణోత్తర పరీక్షల నిమిత్తం రామన్నపేట ప్రభుత్వసుపత్రికి తరలించినట్లు ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని