logo

22 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యుల పలకరింపు

22 ఏళ్ల క్రితం కన్నవాళ్లు, తోబుట్టుల నుంచి విధి దూరం చేసినా.. ‘ఈనాడు’ కథనం కలిపింది. ఇంటి నుంచి తప్పిపోయిన దుర్గ స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మణేశ్వరంలోని

Published : 26 Jan 2022 04:17 IST

‘ఈనాడు’ కథనంతో తెలిసిన ఆచూకీ..

‘దుర్గ’ది పశ్చిమ గోదావరి జిల్ల్లాగా గుర్తింపు
దామరచర్ల, న్యూస్‌టుడే


దుర్గ బావ కొండయ్య, మేనత్త సౌదామణి

22 ఏళ్ల క్రితం కన్నవాళ్లు, తోబుట్టుల నుంచి విధి దూరం చేసినా.. ‘ఈనాడు’ కథనం కలిపింది. ఇంటి నుంచి తప్పిపోయిన దుర్గ స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మణేశ్వరంలోని దేవునితోట ఆవాస గ్రామంగా తేలింది. ‘విధిరాతతో విడిపోయి.. 22 ఏళ్లుగా కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూపులు’ శీర్షికన సోమవారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితం కాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. కథనంలో దుర్గ పేర్కొన్న కుటుంబ సభ్యుల పేర్లను గమనించిన లక్ష్మణేశ్వరంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కొరివి దామోదరం.. దుర్గ మేనేత్త సౌదామణి, బావ కొండయ్యకు విషయం తెలిపారు. వారు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం ఇండియా సిమెంట్సు కర్మాగారం కాలనీలో ఉంటున్న దుర్గకు మంగళవారం రాత్రి ఫోన్‌ చేశారు. ‘హలో దుర్గా.. మాట్లాడుతున్నది మీ మేనత్త సౌదామణిని’ అనగానే దుర్గ నోటివెంట మాట రాలేదు. తాను వింటున్నది నిజమేనా.. అని ఆశ్చర్యపోయింది. వెంటనే తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల పేర్లు చెప్పగానే ‘అందరూ బాగానే ఉన్నారు. పెద్ద అక్క కువైట్లో ఉంటున్నారని, ఇద్దరు చెల్లెళ్లకు వివాహమైందని వారితోనూ మాట్లాడిస్తానని మేనేత్త తెలిపిందని’ దుర్గ వివరించారు. 22 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలువనున్న ఆనందంలో దుర్గ, ఆమె భర్త అశ్వినీకుమార్‌ ఉన్నారు.

ఫోన్‌లో మేనత్తతో మాట్లాడుతున్న దుర్గ

రైల్వేస్టేషన్‌ పక్కనే ఊరు

ముందు నుంచి దుర్గ చెప్పినట్లుగా ఆమె ఊరు నర్సాపురం రైల్వేస్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. లక్ష్మణేశ్వరానికి చెందిన దుర్గ ఆరేళ్ల వయస్సులో రైలు చూడాలనే కోరికతో స్టేషన్‌ వద్దకు వచ్చి రైలు ఎక్కింది. రైలు కదలగా అందులోనే నిద్రపోయి.. కాచిగూడలో దిగింది. రైల్వేపోలీసులు గుర్తించి స్థానిక పోలీసుల సహకారంలో క్రిస్టియన్‌ మిషనరీ పాఠశాలలో చేర్పించారు. ఊరు పేరు గుర్తులేక పోవడంతో తల్లిదండ్రులు త్రివేణి, ఆంజనేయులు, అక్కాచెల్లెళ్లు వెంకటలక్ష్మి, మంగ, లలిత, మేనేత్త సౌదామణి పేర్లను రాసుకొని గుర్తు ఉంచుకుంది. ఇటీవల దుర్గకు మిషనరీ వారు వివాహం జరిపించగా దామరచర్లలో ఉంటున్నారు. ఆమె గాథపై ‘ఈనాడు’ కథనం ప్రచురించడంతో బుధవారం కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారు. విషాదమేమిటంటే దుర్గ తల్లిదండ్రులు ఇటీవల కాలం చేసినట్లు బంధువుల ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని వారు ఫోన్‌లో దుర్గకు తెలియపర్చలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని