logo

విషాదం నింపిన ప్రమాదం

రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు

Published : 27 May 2022 03:06 IST

ముదిగొండ, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన తమలపాకుల భారతమ్మ(55), ఆమె మనవడు వర్షవర్ధన్‌(7) ఈ ప్రమాదంలో చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. భారతమ్మ కుమారుడు ఉపేందర్‌, వనవడు హర్షవర్ధన్‌లతో కలిసి ఆటోలో ఖమ్మం గ్రామీణ మండలం ఏదులాపురం గ్రామంలో బంధువుల దశదిన కర్మకు వెళ్లింది. తిరిగి నేలకొండపల్లికి వస్తుండగా గొకినేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మరో ప్రయాణికుడు కారేపల్లి మండలం కొత్తకమలాపురానికి చెందిన చాగంటి రమేశ్‌(36) అక్కడికక్కడే మృతి చెందారు. ఈయన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా గోడ్రింయాలకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఉపేందర్‌, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ బొడ్డు ఉప్పలయ్యల పరిస్థితి విషమంగా ఉంది. భారతమ్మ శరీరం ఆటోలో ఇరుక్కుపోయి ఛిద్రమైంది. క్షతగాత్రులను ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తరలించారు. డ్రైవరు ఉప్పలయ్య, ఉపేందర్‌లకు చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని