logo

అడ్డదారులొద్దు.. శిశు దత్తత సులువే

పిల్లలు లేని దంపతులకు ప్రభుత్వ పరంగా చట్టబద్దమైన దత్తతకు మార్గం సులువు కానుంది.

Published : 26 Nov 2022 04:35 IST

ఆరు పత్రాలతోనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు
జిల్లాలో 200పైగా పెండింగ్‌
దేవరకొండ, న్యూస్‌టుడే

దత్తతపై నియమ, నిబంధనలతో గోడపత్రిక

పిల్లలు లేని దంపతులకు ప్రభుత్వ పరంగా చట్టబద్దమైన దత్తతకు మార్గం సులువు కానుంది. అడ్డదారిలో దత్తతకు ప్రయత్నిస్తే న్యాయపరమైన చిక్కులు, పోలీస్‌ కేసులు, ఇతర సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ఇక ఆ ఇబ్బంది లేకుండా కేవలం ఆరు పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే చాలు దత్తత ప్రక్రియ పూర్తి చేసేలా స్త్రీ, శిశు సంక్షేమశాఖ తాజాగా వెసులుబాటు కల్పించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆడశిశుల విక్రయాలు, హత్యలు అధికంగా జరుగుతుంటాయి. ప్రభుత్వ యంత్రాంగం పోషించలేని దంపతులకు అవగాహన కల్పించి, చిన్నారులను దత్తత ఇచ్చేలా ప్రోత్సహిస్తే రెండు విధాలా మేలు జరుగుతుంది. నల్గొండలో శిశు గృహను 2005లో ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు 310 మంది శిశువులను దత్తత ఇచ్చారు. 

సరిగ్గా వినియోగించుకుంటే మేలు

మారుమూల ప్రాంతాలైన దేవరకొండ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో దత్తత పేరుతో శిశు విక్రయాలు నిత్యకృత్యం. ఆడపిల్లలపై వివక్షతో భ్రూణ హత్యలు, చెత్తకుప్పలో పడేసిన ఘటనలు అనేకం. దీన్ని నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. ఫలితం నామమాత్రమే. గతంలో ప్రభుత్వం నుంచి చిన్నారులను దత్తత తీసుకునే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండేది. 16 పత్రాలు పొందుపర్చాల్సి ఉండేది. దీంతో చాలా మంది దంపతులు అడ్డదారుల్లో శిశువుల కొనుగోలుకు మొగ్గు చూపేవారు. అలా కొనుగోలు చేసిన వారిలో చాలా మంది న్యాయ సమస్యలు, కేసులు ఎదుర్కొన్నారు.

* తాజాగా ప్రభుత్వం దత్తత విధానాన్ని సరళీకరించింది. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుంటే శిశువును దత్తత తీసుకునే చట్టపరమైన అవకాశం లభిస్తుంది. దత్తత దంపతులు, శిశు వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. దంపతుల ఫొటో, పాన్‌ కార్డు, జనన ధ్రువ పత్రాలు, నివాస, ఆదాయ, దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులు లేవంటూ వైద్యాధికారి జారీ చేసిన ధ్రువపత్రం, వివాహ రిజిస్ట్రేషన్‌ తదితర ఆరు డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకుంటే చాలు. దంపతులకు లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. వారి సీనియార్టీ ప్రకారం వారి దరఖాస్తులు ప్రస్తుత దశ తెలుసుకునే అవకాశం కల్పించారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటే దత్తత ఇస్తారు. శిశువు, లింగం వివరాలు, వయస్సు వివరాలు, ఏ రాష్ట్రానికి చెందిన శిశువు అవసరం తదితర వివరాలు దరఖాస్తు నమోదు చేసుకోవచ్చు. గతంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఉన్న దత్తత ఇచ్చే అధికారాన్ని ఇటీవల కలెక్టర్‌కు దాఖలు పరిచారు. నూతన విధానం అమలు చేసిన తర్వాత శిశవుల దత్తత కోసం 200 పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఆ శాఖ అధికారులు చెప్పారు.

గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, తదితరులు


పైరవీలకు తావులేదు

- గణేశ్‌, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి

దత్తత ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. శిశువు కావాల్సిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఉంటే వారికి సీరియల్‌ ప్రకారం పక్షపాతం లేకుండా మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటే ప్రతిపాదికన ఇస్తాం. పైరవీలకు ఆస్కారం లేదు. త్వరలో దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి అందుబాటులో ఉన్న చిన్నారులను దత్తత ఇస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని