logo

పురం సిగలో..హరితహారం

నల్గొండ పట్టణం రాక్‌హిల్‌కాలనీ నుంచి మునుగోడు బైపాస్‌ వెళ్లే మార్గం ఇది. ఈ రోడ్డుకు ఇరువైపులా సుమారు రెండు వేలకుపైగా ఏపుగా పెరిగిన మొక్కలు నాటడంతో హరితశోభను సంతరించుకుంది.

Published : 29 Nov 2022 06:13 IST

నందన వనాలుగా మారుతున్న ఉమ్మడి జిల్లా పట్టణాలు
నల్గొండ పురపాలిక, సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే

నల్గొండ పట్టణం రాక్‌హిల్‌కాలనీ నుంచి మునుగోడు బైపాస్‌ వెళ్లే మార్గం ఇది. ఈ రోడ్డుకు ఇరువైపులా సుమారు రెండు వేలకుపైగా ఏపుగా పెరిగిన మొక్కలు నాటడంతో హరితశోభను సంతరించుకుంది. ఈ మార్గం మీదుగా నిత్యం వేలాది మంది వాకింగ్‌ చేస్త్తూ మంచి స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే మాదిరిగా పట్టణంలో 14 కి.మీ మేర రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటు ఇటీవల విస్తరించిన రోడ్ల డివైడర్ల మధ్యన పచ్చని ఆహ్లాదకరమైన పూల మొక్కలు నాటించారు.

తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా ఏటా పట్టణాల్లో మొక్కలు నాటించి పచ్చదనం పెంపునకు కృషి చేస్తోంది. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటిస్తూ ఇళ్లల్లో పూలు, పండ్లు మొక్కలు పెంచేలా చర్యలు చేపడుతున్నారు. రెండేళ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికల్లో చేపట్టిన పట్టణ ప్రకృతి వనాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు, రహదారి డివైడర్ల మధ్య, ఇరువైపులా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటించారు. పట్టణాల్లో పలు ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి కంచెలను ఏర్పాటు చేశారు. జామ, దానిమ్మ, వేప, స్పాతోడియా, గుల్‌మోహర్‌, అల్లనేరేడు, ఉసిరి, పనస, బొగన్‌విల్లా, టేరోమా, హతోడియా, కొబ్బరి, వంటి మొక్కలు నాటించారు. వాటికి క్రమం తప్పకుండా నీళ్లు అందించేందుకు ప్రత్యేకంగా నీటి సౌకర్యం కల్పించారు. ఏపుగా పెరిగేందుకు అవసరమైన ఎరువులను వినియోగిస్తున్నారు. వీటి నిర్వహణ నిమిత్తం ఏటా ఆయా మున్సిపాలిటీలు 30 శాతం వరకు గ్రీన్‌ బడ్జెట్‌ రూపంలో నిధులు కేటాయిస్తున్నాయి.

* పట్టణాల్లో 35 శాతం పచ్చదనం విస్తరిస్తే మెరుగైన వాతావరణంలో జీవిస్తున్నట్లు లెక్కా. పెరుగుతున్న పట్టణ జనాభాకు తగ్గట్టు వారి జీవన ప్రమాణాలు మెరుగవడానికి పార్కులు, పట్టణ ప్రకృతి వనాలు వంటివి దోహదపడుతున్నాయి. వాయు కాలుష్యం నుంచి ఉపశమనం కల్పించేందుకు పట్టణాల్లో బృహత్‌ వనాలు, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఆరోగ్యకర పోటీకి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి గ్రీన్‌ స్పేస్‌ ఇండెక్స్‌ పోటీకి పిలుపునివ్వడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికలు అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలన్నింటిలో ప్రకృతి వనాలు పెంచేందుకు శ్రీకారం చుట్టాయి.


* నల్గొండ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డుకాలనీ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మూడేళ్ల కింద నాటిన మొక్కలు  ప్రస్తుతం ఏపుగా ఎదిగి.. ఫలాలు ఇస్తున్నాయి. సుమారు ఎకరం విస్తీర్ణంలో వందల సంఖ్యలో మామిడి, పనస, జామ, అల్లనేరేడు మొక్కలతోపాటు వేప, నిమ్మ వంటి చెట్లను పెంచడంతో అ ప్రాంతం అంత పచ్చదనం సంతరించుకుంది. సూర్యాపేట పట్టణంలోని మామిళ్లగడ్డ కాలనీ, మిర్యాలగూడ, భువనగిరి, చండూరు, చిట్యాల, దేవరకొండ పట్టణాల్లో ప్రధాన రహదారులు, ఖాళీ ప్రదేశాలు హరిత వనాలుగా మారిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని