logo

అక్రమాల నీడలో.. నూడ

ఇలా ఒకటి, రెండు కాదు. వందల సంఖ్యలో అక్రమంగా ఇళ్లు, భవనాలు, ఫంక్షన్‌హాళ్ల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి  నీలగిరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నూడ) పరిధిలోని 42 గ్రామ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతోంది.

Published : 06 Dec 2022 04:09 IST

కాగితాల్లో వ్యవసాయ భూములు.. క్షేత్రస్థాయిలో ఫంక్షన్‌హాళ్లు

నూడ పరిధిలోని కనగల్‌ మండలం రేణుకాఎల్లమ్మదేవి ఆలయం నుంచి ధర్వేశిపురం గ్రామానికి వెళ్లే మార్గంలో వ్యవసాయ పొలంలో ఫంక్షన్‌హాల్‌ నిర్మిస్తున్నారు. రెవెన్యూశాఖ నుంచి నాలా, అగ్నిమాపకశాఖ, డీటీపీసీ, నూడ నుంచి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా నిర్మాణం కొనసాగిస్తున్నారు. ప్రమాదం చోటు చేసుకుంటే తక్షణ నివారణ చర్యలు తీసుకోవడానికి సెట్‌ బ్యాక్‌ కూడా వదలకుండా పనులు చేపట్టారు.

నల్గొండ జిల్లాపరిషత్‌, న్యూస్‌టుడే: ఇలా ఒకటి, రెండు కాదు. వందల సంఖ్యలో అక్రమంగా ఇళ్లు, భవనాలు, ఫంక్షన్‌హాళ్ల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి  నీలగిరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నూడ) పరిధిలోని 42 గ్రామ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో విచ్చల విడిగా..ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు కుమ్మక్కై  నల్గొండ, తిప్పర్తి, కనగల్‌, నార్కట్‌పల్లి మండలాల్లోని గ్రామాల్లో అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లల్లో గండి పడుతోంది.

పొలాల్లోనే ఫంక్షన్‌హాళ్లు

నల్గొండ జిల్లాలో పేరు పొందిన ఆలయాల్లో ధర్వేశిపురం ఎల్లమ్మదేవి గుడి మొదటి వరుసలో ఉంటుంది. నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు హాజరై పూజా కార్యక్రమాలు, ఫంక్షన్లు నిర్వహిస్తారు. వాటికితోడు విందు, వినోదాలకు అవకాశం ఉండటంతో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. దీని ఆసరాగా తీసుకున్న కొందరు పంటపొలాల్లో రెండు, మూడు ఎకరాల విస్తీర్ణంతో ఫంక్షన్‌హాళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 25కు పైగా నిర్మించారు. అందులో చాలా వాటికి నాలా, అగ్నిమాపకశాఖ, నూడ, డీటీపీసీ అనుమతులు లేవు. పైగా నిబంధనలను తుంగలో తొక్కి కొందరూ అసైన్డ్‌ భూముల్లో సైతం అక్రమ షెడ్లు నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామ పంచాయతీకి  కేవలం 340 గజాల ఇళ్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఎకరాల విస్తీర్ణంలో అనుమతి ఇచ్చే వీలు లేదు. నూడ అమల్లోకి వచ్చి ఏడాది అవుతున్నప్పటికి అంతకు ముందు తేదీల్లో గ్రామ పంచాయతీ అనుమతి తీసుకున్నట్లు దస్త్రాలు తయారు చేస్తూ అక్రమాలకు, అవినీతికి  పాల్పడుతున్నారు. విద్యుత్తుశాఖ అనుమతి లేకుండానే క్షేత్రస్థాయి అధికారులను మచ్చిక చేసుకుని ఉచిత విద్యుత్తు బోర్లను ఫంక్షన్‌హాళ్లకు వినియోగిస్తున్నారు. మరో పక్క కాగితాల్లో వ్యవసాయ భూములుగా చూపిస్తూ రైతు బంధు పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఫంక్షన్‌హాళ్లు నిర్మించి అద్దెల రూపంలో రూ.లక్షలు ఆర్జిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అనుమతుల ఫీజు, ఆస్తిపన్నులు తప్పించుకుంటున్నట్లు తెలిసింది.


నార్కట్‌పల్ల్లి- అద్దంకి జాతీయ రహదారి పక్కన యల్లారెడ్డిగూడం నుంచి చెర్వుగట్టు దేవస్థానం వెళ్లే మార్గంలో గ్రామ పంచాయతీ నుంచి (జీ-ఫ్లస్‌ వన్‌) అనుమతి తీసుకుని.. అనుమతులకు విరుద్ధంగా సెల్లార్‌తో పాటు మరో నాలుగు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. అధికారులకు తెలిసినా కేవలం ఒక నోటీసు జారీ చేసి వదిలేశారు.


నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం
- రమణాచారి, వైస్‌ఛైర్మన్‌, నూడ

నూడ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాలు మా దృష్టికి రాలేదు. ఎక్కడైనా నిర్మిస్తే నోటీసులు జారీ చేస్తాం. అవినీతి, అక్రమాల్లో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఉంటే జిల్లా పంచాయతీ అధికారి, కలెక్టర్‌ చర్యలు తీసుకుంటారు. త్వరలోనే నూడ పరిధిలోని అధికారులతో సమీక్ష నిర్వహించి తదుపరి నివారణ చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు