logo

నోటుకు ఓటు.. ప్రజాస్వామ్యానికి చేటు

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయధం వంటిదని నల్గొండ టూటౌన్‌ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

Published : 25 Jan 2023 03:00 IST

‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

సదస్సులో మాట్లాడుతున్న నల్గొండ టూటౌన్‌ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయధం వంటిదని నల్గొండ టూటౌన్‌ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండలోని నీలగిరి డిగ్రీ, పీజీ కళాశాలలో ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఓటు వినియోగం ద్వారా మంచి పాలకులను ఎన్నుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఓటింగ్‌శాతం పెరిగేలా యువత ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. నోటుకు ఓటును అమ్ముకోకుండా నిజాయితీ గల వారికే ఓటు వేయాలని సూచించారు. ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఓటు నమోదు, వినియోగంపై విద్యార్థులు, అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు.


యువత ఓటు నమోదు చేసుకోవాలి

మారం నాగేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌, నీలగిరి డిగ్రీ, పీజీ కళాశాల  

18 ఏళ్లు నిండిన యువతీయువకులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలి. ఎన్నికల్లో ఓటు ఉపయోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టమవుతుంది. ఓటు పొందిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవాలి. తమ కళాశాలలో అర్హత గల వారు ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తాం. యువత ఓటు ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి.


బాధ్యతగా భావించాలి

సైదులు, సెక్టార్‌ ఎస్సై, నల్గొండ

యువత ఓటు హక్కు నమోదును బాధ్యతగా భావించాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవడం ద్వారా ఓటింగ్‌శాతం పెరిగి స్వచ్ఛమైన నాయకులను  ఎన్నుకునే అవకాశం ఉంటుంది. నోటుకు ఓటు వేసే విధానానికి స్వస్తి పలకాలి. నిజాయితీ గల వారు చట్టసభలకు వెళ్తే తమ ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ది సాధిస్తాయి. యువత ఓటు నమోదుపై అవగాహన ర్యాలీలు నిర్వహించాలి. దేశ భవిత యువత చేతిలో ఉందని గుర్తించాలి.


అవగాహన పొందాను

సింధు, డిగ్రీ

నేను ఇటీవల ఓటు నమోదు చేసుకున్నాను. ఈ సదస్సు ద్వారా ఓటు ఉపయోగించుకునే విధానంపై అవగాహన పొందాను. మంచి నాయకులకే ఓటు వేయడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలుసుకున్నాను. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వినియోగించుకుని...ఇతరులు కూడా వేసుకునేలా అవగాహన కల్పిస్తాను.


నిస్వార్థ నాయకులకే పట్టం

స్వామి, విద్యార్థి

వచ్చే ఎన్నికల్లో మంచి నాయకుడికి ఓటేస్తా. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి. ఓటు ద్వారా దేశం ప్రగతి సాధిస్తుంది. మనం వేసే ఓటు ఓ నిమిషంలో అయిపోయేదే...కానీ దాని ప్రభావం మనపై ఐదేళ్లు ఉంటుందని గుర్తించాలి. అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని