logo

ధాన్యం కొనుగోళ్లలో మాయాజాలం గుట్టురట్టు

నకిరేకల్‌లో జరిగిన ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, తూకాల్లో మిల్లర్ల మాయాజాలం వాస్తవమేనని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తాజాగా తేల్చింది.

Published : 27 Jan 2023 06:01 IST

ఇద్దరు అధికారులపై చర్యలకు ఆదేశాలు
ముందే వెలుగులోకి తెచ్చిన ‘ఈనాడు’

ధాన్యం కొనుగోళ్లలో మోసాలపై ‘ఈనాడు’లో ప్రచురితమైన ఓ కథనం

నకిరేకల్‌, న్యూస్‌టుడే: నకిరేకల్‌లో జరిగిన ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, తూకాల్లో మిల్లర్ల మాయాజాలం వాస్తవమేనని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తాజాగా తేల్చింది. నకిరేకల్‌ మండలం ఓగోడు గ్రామంలో 2020-21 సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్‌కు గాను ఆ ఏడాది మార్చి నుంచి మే వరకు ఐకేపీ కేంద్రం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు నిర్వహించారు. ఓగోడుతోపాటు పరిసర గ్రామాలకు చెందిన దాదాపు 357 మంది రైతులు 27 వేల క్వింటాళ్లకుపైగా ధాన్యం విక్రయించారు. వీటికి సంబంధించిన ధాన్యం డబ్బులు జూన్‌, జూలై మాసాల్లో రైతుల ఖాతాల్లో జమయ్యాయి. కొనుగోలు సమయంలో 40 కిలోల బస్తాకు తరుగు పేరిట అదనంగా ధాన్యం సేకరించారు. రైతులకు డబ్బులు చెల్లించే సమయంలో మాత్రం తరుగు పేరుతో భారీగా కోత విధించారు. ఒక్కో రైతుకు రూ.5 వేల నుంచి 20 వేల వరకు కోతపడింది. ఇలా కోత విధించిన ధాన్యం డబ్బు పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్‌ విచారణలో గుట్టురట్టయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాలపై 2021 జూన్‌ 24 నుంచి ‘ఈనాడు’ వరుస కథనాలు ప్రచురించింది. రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఓగోడు కేంద్రంలో నాడు ధాన్యం విక్రయించిన రైతులు రూ.3 లక్షల వరకు నష్టపోయారని తాజాగా విజిలెన్స్‌ విచారణలో తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో పౌరసరఫరాల శాఖË మేనేజర్‌, ఓగోడు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించాల్సిన మండల ఏపీఎంను బాధ్యులను చేస్తూ వీరిపై చర్యల కోసం పౌరసరఫరాల కమిషనర్‌ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. నాడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన రైతులకు మాత్రమే వారు నష్టపోయిన డబ్బుల్లో కొంత మేర సెర్ఫ్‌ నుంచి రూ.1.05 లక్షలు, ఐకేపీ కేంద్రం నిర్వాహకులు మరికొంత సొమ్మును తిరిగి చెల్లించారు. ఫిర్యాదులు చేయని ఇంకా చాలా మంది రైతులకు పరిహారం అందలేదు.

మిల్లులపై చర్యలు నామమాత్రం

నాడు ఈ ప్రాంతంలోని ఐదు మిల్లులు ఈ ధాన్యం దిగుమతులకు సంబంధించి తూకాల్లో మోసాలకు పాల్పడినట్లు విజిలెన్సు అప్పట్లోనే గుర్తించడంతో గత జులై నుంచి ఈ మిల్లులను అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టి సీఎంఆర్‌ ధాన్యం కేటాయించలేదు. మిల్లులపై ఎలాంటి చర్యలు లేకుండానే ఈ ఖరీఫ్‌లో ఈ మిల్లులపై జిల్లా అధికారులు నిషేధం ఎత్తివేసి సీఎంఆర్‌ ధాన్యాన్ని కేటాయించడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు