logo

పదోన్నతుల సమస్య.. తీరక ఆందోళన బాట

భాషా పండితులకు పదోన్నతులు చేపట్టకపోవడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 29 Jan 2023 04:03 IST

ఒకటి నుంచి భాషోపాధ్యాయుల తరగతుల బహిష్కరణకు పిలుపు

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: భాషా పండితులకు పదోన్నతులు చేపట్టకపోవడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా భాషా పండితుల పదోన్నతుల విషయంలో అన్యాయం జరుగుతోందనే ఆవేదన వ్యక్తమవుతూనే ఉంది. వీరి ఆందోళనల ఫలితంగా యూపీఎస్‌ల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయడంతో పండిట్‌ పోస్టులను కూడా అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ మేరకు అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు చేపట్టలేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర పండిత ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి ఐక్యవేదికగా ఏర్పడి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్థూ బోధనను నిలిపివేయాలని, జాబ్‌చార్ట్‌ ప్రకారమే విధులు నిర్వహించాలని నిర్ణయించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో లాంగ్వేజి పండిట్‌లు తెలుగు 345 మంది, హిందీ 377 మంది, ఉర్థూ 10 మంది ఉన్నారు.

జాబ్‌చార్టు ప్రకారం..

జాబ్‌చార్టు ప్రకారం భాషా పండిట్‌లు 6,7,8 తరగతులు బోధించాల్సి ఉండగా.. జిల్లాలో చాలా వరకు ఉన్నత పాఠశాలల్లో వీటితో పాటు 9, 10 తరగతులను వీళ్లే బోధిస్తున్నారు. అందుకు రూ.150 అదనంగా అలవెన్స్‌ ఇస్తారు. ఈ అలవెన్స్‌ కూడా కొన్ని చోట్ల పండితులకు అందడం లేదు. ప్రస్తుతం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టడంతో భాషాపండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు వినతలు సమర్పించడమే కాకుండా.. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు కూడా హాజరై ఆందోళన వ్యక్తం చేశారు. అయినా.. వాళ్ల సమస్య పరిష్కారం కాకపోవడంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు బోధన బంద్‌ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్పష్టం చేస్తూ తమ కార్యాచరణ రూపొందిస్తున్నారు.


న్యాయం చేయాలి..

ఎండి.యూసుఫుద్దీన్‌, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ అధ్యక్షుడు, నల్గొండ జిల్లా

భాషాపండితులకు పదోన్నతుల విషయంలో ఏళ్ల తరబడి అన్యాయం జరుగుతొంది, ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలి. కోర్టు కేసు పేరుతో కాలయాపన చేయడం వల్ల ఎంతో మంది భాషాపండితులు పదోన్నతులు పొందకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ప్రభుత్వం కోర్టు స్టేను ఖాళీ చేయించి పదోన్నతులు ఇవ్వాలి. ఈ విషయంలో సీఎం చొరవ తీసుకుని న్యాయం చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని