logo

ఆశయ గమనంలో అంశాల అస్తమయం

అత్యధిక ఫ్లోరిన్‌ పీˆడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లాకు రక్షిత తాగు, సాగు నీటి జలాల సాధనలో ఆయన అలుపెరుగని పోరాటం చేశారు.

Updated : 29 Jan 2023 06:23 IST

అంశాల స్వామి మృతదేహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల
ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వాసుదేవరెడ్డి, తదితరులు

మర్రిగూడ (నాంపల్లి), న్యూస్‌టుడే: అత్యధిక ఫ్లోరిన్‌ పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లాకు రక్షిత తాగు, సాగు నీటి జలాల సాధనలో ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. మారుమూల పల్లె జనం నీటి బాధలను తెలియజెప్పి దేశం దృష్టిని నల్గొండ వైపు మళ్లించారు. అతనే మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన అంశాల స్వామి(37). శుక్రవారం సాయంత్రం మూడు చక్రాల వాహనంపై నుంచి కింద పడిన ఆయన శనివారం ఉదయం కన్నుమూశారు.

పోరాట ఫలితమే.. ‘మిషన్‌ భగీరథ’

ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో అంశాల స్వామి అలుపెరుగని పోరాటం, ప్రజల తాగు నీటి ఇబ్బందులు గమనించిన తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్‌ భగీరథ’తో తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టింది. నల్గొండ జిల్లాలో సాగు నీటిలో సైతం ఫ్లోరైడ్‌ ఆనవాళ్లు ఉండటం, ఈ ప్రాంత ప్రజల స్థితిగతులను క్రోడీకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగు జలాల సరఫరాకు పచ్చజెండా ఊపాయి. వీటి ప్రతిఫలమే నక్కలగండి, డిండి ఎత్తిపోతల పథకాలు.

అంశాల స్వామి మృతదేహంపై విలపిస్తున్న జల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ

కడసారిగా కదిలి వచ్చిన ఆత్మీయత..

అంశాల స్వామి మృతి చెందడంతో ఆయన స్వగ్రామమైన శివన్నగూడేనికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నాంపల్లి, మర్రిగూడ, చండూరు, చింతపల్లి, మునుగోడు మండలాల నుంచి వచ్చిన ప్రజలు మా గ్రామాలకు తాగు నీరు రావడానికి కారణం నీవే అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు దివ్యాంగులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేసి, అంతిమ సంస్కార పనులను పర్యవేక్షించారు. అంతిమ యాత్రలో ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి…, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, భారాస రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్‌ పాడె మోశారు. మాజీ ఎంపీˆ బూర నర్సయ్యగౌడ్‌, జడ్పీటీసీ సభ్యులు పాశం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, మాల్‌ మార్కెట్ ఛైర్మన్‌  జగదీశ్‌, కాంగ్రెస్‌ నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్‌, జల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ, కంచుకట్ల సుభాష్‌, వివిధ పార్టీల నాయకులు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు.  మంత్రి కేటీఆర్‌ ఆదేశం మేరకు అంత్యక్రియల ఖర్చును తాను భరించినట్లు కర్నాటి విద్యాసాగర్‌ తెలిపారు. ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ఆలపించిన గీతాలు పలువురిని కంటతడి పెట్టించాయి. స్వామి మృతి చెందడం బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని