logo

చిన్నారిని చిదిమేసిన బడి బస్సు

ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారి. అప్పటి వరకు బుడిబుడి నడకలతో ఇంట్లో సందడి చేసింది. ఇంతలో మృత్యురూపంలో వచ్చిన బడి బస్సు పసిపాప జీవితాన్ని చిదిమేసింది.

Published : 01 Feb 2023 05:33 IST

మృతి చెందిన నైనిక (పాతచిత్రం)

చివ్వెంల, న్యూస్‌టుడే: ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారి. అప్పటి వరకు బుడిబుడి నడకలతో ఇంట్లో సందడి చేసింది. ఇంతలో మృత్యురూపంలో వచ్చిన బడి బస్సు పసిపాప జీవితాన్ని చిదిమేసింది. ఈ ఘటన సూర్యాపేట పురపాలిక పరిధి రెండోవార్డులోని కోమటికుంటలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోమటికుంటకు చెందిన మేడారపు శేఖర్‌, నాగరాణికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు సంతానం. ఐదేళ్ల పెద్ద కూతురు సూర్యాపేట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటోంది. రోజూ మాదిరిగానే సోమవారం సాయంత్రం బస్సులో వచ్చిన పెద్ద కూతురును తీసుకొచ్చేందుకు తల్లి నాగరాణి ఆ పాఠశాల బస్సు వద్దకు వెళ్లి.. బిడ్డను తీసుకొని తిరుగుముఖం పట్టారు. వెనకాలే వచ్చిన చిన్న కూతురు నైనిక (3)ను తల్లి గమనించలేదు. పెద్దకూతురు, తల్లి బస్సును దాటగానే డ్రైవర్‌ వాహనాన్ని కదిలించాడు. వారి వెనుకే వెళ్తున్న చిన్నారి కనిపించకపోవడంతో బస్సుతో ఢీకొట్టారు. టైరు తాకడంతో తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందారు. తల్లి నాగరాణి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చివ్వెంల ఎస్సై పి.విష్ణుమూర్తి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని