logo

వేతనాలు లేక.. కార్మికులు విలవిల

గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వాలు నిర్ణీత సమయంలో నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది.

Published : 04 Feb 2023 05:22 IST

పంచాయతీ ఖజానాలు ఖాళీ
భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే

మురుగు కాలువను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వాలు నిర్ణీత సమయంలో నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. జిల్లా పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు నేటికీ రెండు నుంచి ఐదు నెలల వేతనాలు రావాల్సి ఉంది. అభివృద్ధి నిర్మాణాలు దేవుడెరుగు, నిర్వహణకు అయ్యే ఖర్చులను కొందరు సర్పంచులు సొంతంగా చెల్లిస్తూ అప్పుల పాలయ్యారు.

జిల్లా పరిధిలో 421 గ్రామపంచాయతీలు ఉన్నాయి. సుమారు 1460 మంది కార్మికులు, 249 మంది మల్టీపర్పస్‌ కార్మికులు పనిచేస్తున్నారు. మల్టీపర్పస్‌ కార్మికులకు నెలకు రూ.8,500, కార్మికులకు పంచాయతీ స్థానిక ఆర్థిక వనరులను బట్టి నెలకు రూ.2 వేల నుంచి రూ.5వేల వరకు వేతనంగా చెల్లిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, వాటర్‌ మెన్‌లు, ఎలక్ట్రిషియన్లు, ట్రాక్టర్‌ డ్రైవర్లు, కారోబార్‌లు ప్రధాన భూమికను పోషిస్తున్నారు. చిన్న పంచాయతీలో గరిష్ఠంగా ఇద్దరు, పెద్ద పంచాయతీల్లో 32 మంది వరకు పనిచేస్తున్నారు. గతంలో వీరికి ఎస్‌ఎఫ్‌సీ, 14, 15 ఆర్థిక సంఘం నిధుల నుంచి వేతనాలు చెల్లించేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌సీ నిధులు నిర్ణీత వ్యవధిలో మంజూరు చేయడంలేదు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా పటిష్ఠ చర్యలు చేపట్టడంతో ఈ నిధులను వేతనాలు, నిర్వహణకు వినియోగించుకునే వీలులేకుండా పోయింది. ప్రస్తుతం కార్మికులు వేతనాలతో పాటు ట్రాక్టర్‌ ఈఎంఐ, డీజిల్‌, పైప్‌లైన్ల మరమ్మతులు ఇతర పనులు చేపట్టలేని పరిస్థితి పంచాయతీల్లో నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు నిధులు నిర్ణీత వ్యవధిలో మంజూరు చేయడంతో పాటు నిర్వహణ కోసం నిధులు ఖర్చు చేసుకునే అనుమతిస్తే పంచాయతీలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి, గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది.


నిధులు మంజూరు చేయాలి

-ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, సర్పంచుల సంఘం

నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతోంది. చిన్న పనులు సైతం చేయలేకపోతున్నాం. కార్మికుల వేతనాలు, నిర్వహణ ఖర్చులకు డబ్బులు లేక సర్పంచులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. నెలనెలా కార్మికులు వేతనాలు చెల్లించకపోవడంతో వారికి పని చెప్పలేక పోతున్నాం. ట్రాక్టర్‌ ఈఎంఐ, డీజిల్‌ ఖర్చు భారంగా మారింది. ఎస్‌ఎఫ్‌సీ నిధులు మంజూరు చేయాలి.


మున్సిపల్‌ కార్మికులతో సమానంగా..

- గడ్డం ఈశ్వర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి, గ్రామపంచాయతీ కార్మికుల సంఘం

పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలనెలా వేతనాలు చెల్లించాలి. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయమై పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా వినతి సమర్పించినా పరిస్థితిలో మార్పులేదు. మున్సిపల్‌ కార్మికులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని