logo

వినిపించని కూత.. ఆశలకు కోత

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు కేటాయింపులు చేయకుండా మొండిచెయ్యే చూపింది.

Published : 04 Feb 2023 05:22 IST

ఊసేలేని హైదరాబాద్‌ - విజయవాడ వయా సూర్యాపేట రైలుమార్గం

ఈనాడు, నల్గొండ: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు కేటాయింపులు చేయకుండా మొండిచెయ్యే చూపింది. ఎంఎంటీఎస్‌ రెండోదశ, డబ్లింగ్‌, హైదరాబాద్‌ - విజయవాడ మార్గంలో సూర్యాపేట, కోదాడ మీదుగా బుల్లెట్‌రైళ్లు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. బీబీనగర్‌ - గుంటూరు మార్గంలో డబ్లింగ్‌ నిమిత్తం రూ.60 కోట్లు కేటాయించిన కేంద్రం, పగిడిపల్లి - నల్లపాడు (285 కి.మీ.) మార్గంలో విద్యుద్దీకరణకు రూ.32.8 కోట్లు కేటాయించింది. ఈ రెండు కేటాయింపులు తప్పితే మిగిలిన ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు నిరాశే మిగిలింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్‌) తమ పరిధిలోని పలు ప్రాజెక్టులకు కేటాయించిన నిధులపై ఓ నోట్‌ను విడుదల చేసింది.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఎంఎంటీఎస్‌ రెండో దశ విస్తరణలో భాగంగా ఘట్‌కేసర్‌ - యాదాద్రి (రాయగిరి ) రైలు మార్గానికి ఈ ఏడాది బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. గత బడ్జెట్‌లో ఈ మార్గానికి కేవలం రూ.10 లక్షలు కేటాయించి మమ అనిపించిన కేంద్ర సర్కారు ఈ ఏడాదీ ఆ నిధులనూ కేటాయించలేదు.
* రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రికి రైలుమార్గం కల్పించేందుకు వీలుగా ఎంఎంటీఎస్‌ రెండో దశను విస్తరించాలని అధికారులు 2016 - 17 బడ్జెట్‌లో నిర్ణయించారు. ఘటకేసర్‌ నుంచి 33 కి.మీ. ఈ మార్గాన్ని తొలుత రూ.412 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించారు. పెరిగిన ధరల ప్రకారం ఈ అంచనా వ్యయం సుమారు రూ.1300 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టులో మూడింట రెండింతల నిధులు రాష్ట్రం, మిగిలిన ఒక భాగం కేంద్రం సమకూర్చాలని గతంలోనే ఒప్పందం జరిగింది.
* హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు వయా సూర్యాపేట, కోదాడ మీదుగా జాతీయ రహదారి 65కి అనుసంధానంగా బుల్లెట్‌ రైలును నడపాలని ఇక్కడి ప్రజాప్రతినిధులు ఏటా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటూ ఉమ్మడి జిల్లా ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌ పలుమార్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు జరిపిన సమావేశాల్లోనూ ఈ ప్రతిపాదనలు చేశారు. అప్పట్లో సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ ఈ బడ్జెట్‌లోనూ ఈ మార్గంలో ఒక్క రూపాయి కేటాయించకపోవడం గమనార్హం.
* గుంటూరు రైల్వే డివిజన్‌లో సరకు రవాణా ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్న 56 కి.మీ. విష్ణుపురం (దామరచర్ల) - మోటమర్రి వయా జగ్గయ్యపేట మార్గంలో ప్రయాణికుల రైళ్లను నడపాలని చాలా రోజుల నుంచి ఈ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. అయితే ఇది గిట్టుబాటు కాదని వెల్లడించిన రైల్వే అధికారులు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. దీంతో ఈ మార్గం గుండా విజయవాడ, ఖమ్మం తదితర ప్రాంతాలకు వెళ్లే మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ వాసులకు ఇది నిరాశపరిచేదే.
* ఏళ్లుగా ఊరిస్తున్న బీబీనగర్‌ - నడికుడి (గుంటూరు) డబ్లింగ్‌ లైను రెండేళ్ల క్రితం మంజూరైనా.. ఈ 248 కి.మీ. మార్గంలో డబ్లింగ్‌ పనులకు రూ. 2480 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. మూడేళ్ల క్రితమే ఈ మార్గంలో విద్యుద్దీకరణ పూర్తి కాగా.. ఈ బడ్జెట్‌లో డబ్లింగ్‌ పనులకు రూ. 60 కోట్లు కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు