logo

మిషన్‌ 8

సూర్యాపేట పుర పరిధిలోని దురాజ్‌పల్లిలో రెండేళ్లకోసారి జరిగే శ్రీ లింగమంతుల స్వామి జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Published : 04 Feb 2023 05:22 IST

సూర్యాపేట కలెక్టరేట్,  చివ్వెంల, న్యూస్‌టుడే

సూర్యాపేట పుర పరిధిలోని దురాజ్‌పల్లిలో రెండేళ్లకోసారి జరిగే శ్రీ లింగమంతుల స్వామి జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి 9 వరకు జరిగే జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వివిధ శాఖల సమన్వయంతో జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర జరిగే పెద్దగట్టు చుట్టూ ఎనిమిది జోన్లుగా విభజించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
జిల్లా పరిషత్‌, జిల్లా పంచాయతీ, పుర కమిషనర్లకు సంబంధించి శాఖల అధికారులు, సిబ్బంది సదరు జోన్లలో విధులు నిర్వర్తించేలా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిది జోన్లకు సంబంధించి మూడు షిఫ్టుల్లో 188 చొప్పున 564 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించేలా సన్నాహాలు చేశారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి పది గంటల వరకు, రాత్రి పది నుంచి ఉదయం 6 గంటల వరకు విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.


జోన్‌-1

దురాజ్‌పల్లి జంక్షన్‌ వద్ద నుంచి కో-ఆపరేటివ్‌ కార్యాలయం వరకు ఒకటో జోన్‌గా విభజించారు. భక్తులు లోపలికి వచ్చే మార్గం కావడంతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరిధిలో ఒక పంచాయతీరాజ్‌ అధికారి, హెల్త్‌ అసిస్టెంట్, సూపర్‌ వైజర్‌, పారిశుద్ధ్య జవాన్‌ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి, భక్తులకు తాగునీటి, ఇతర ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు.


జోన్‌-2

కో-ఆపరేటివ్‌ కార్యాలయం నుంచి కట్ట మైసమ్మ వరకు జోన్‌-2గా కేటాయించారు. ఈ జోన్‌లో నుంచి భక్తులు లోపలికి వస్తారు. ఈ ప్రాంతంలో భక్తులకు తాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు సిబ్బంది నిర్వర్తించే విధులను పంచాయతీ అధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు.


జోన్‌-3

చెరువు కట్ట మైసమ్మ దగ్గరి నుంచి ఎగ్జిబిషన్‌ వరకు జోన్‌-3గా నిర్ణయించారు. ఈ జోన్‌లో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని అధికారులు సూచనలు జారీ చేశారు. సమీపంలో వైద్య, పోలీస్‌ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.


జోన్‌-4

ఎగ్జిబిషన్‌ ప్రాంతం నుంచి కోనేటి వరకు జోన్‌- 4గా అధికారులు కేటాయించారు. ఈ ప్రాంతంలోనూ భక్తులకు స్నానపు వాటికలు, మరుగుదొడ్లు ఉండటంలో ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య సిబ్బంది సక్రమంగా పనులు చేసేలా జవాన్‌, పంచాయతీ రాజ్‌ శాఖల అధికారులు అందుబాటులో ఉండనున్నారు.


జోన్‌-5

కోనేటి నుంచి ప్రభుత్వ బోర్ల వరకు జోన్‌- 5గా విభజించారు. ఈ ప్రాంతంలో భక్తులు, సమీప గ్రామాల ప్రజలు, వాహనాల పార్కింగ్‌ ఉండటంతో  ఇక్కడ అధికంగా తాకిడి ఉండనుంది. దీంతో సదరు ప్రాంతంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. వాహనాల రాకపోకలకు సంబంధించి ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోనున్నారు.


జోన్‌-6

ప్రభుత్వ బోర్ల నుంచి సింహద్వారం వరకు జోన్‌- 6గా నిర్ణయించారు. వీఐపీల సందర్శనార్ధం ఈ ద్వారం కేటాయించడంతో ఎప్పటికప్పడు ట్రాఫిక్‌ వాహనాల మళ్లింపు, వాహనాలు నిలుపకుండా, భక్తులు రాకపోకలు సైతం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.


జోన్‌-7

సింహద్వారం నుంచి ఖాసింపేట జంక్షన్‌ వద్దకు జోన్‌- 7గా నిర్ణయించారు. ఈ ప్రాంతంలో జాతీయ ప్రధానదారి ఉండటంతో భక్తులు రాకపోకలు అధికంగా సాగిస్తుంటారు. ద్విచక్ర వాహనాలు, కార్లు రహదారిపైకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. వీఐపీల రాకపోకలు ఉండటంతో పోలీసులు అధికారులు ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.


జోన్‌-8

ఖాసీంపేట నుంచి మళ్లీ దురాజ్‌పల్లి జంక్షన్‌ వరకు జోన్‌- 8గా విభజించారు. ఈ ప్రాంతంలో నేరేడుచర్ల రహదారి మీదుగా భక్తులు, ఇతర ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. జాతరకు వచ్చే భక్తులు ద్విచక్ర వాహనాలు ఇక్కడే నిలిపేలా చర్యలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని