logo

రేషన్‌బియ్యం తరుగునకు చెక్‌

రేషన్‌ బియ్యం తరుగునకు ఇక చెక్‌ పడనుంది. ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల్లో జరిగే దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Published : 07 Feb 2023 06:22 IST

అమల్లోకి రేషన్‌ డీలర్లకు బయోమెట్రిక్‌

నల్గొండ కలెక్టరేట్‌, గరిడేపల్లి, న్యూస్‌టుడే: రేషన్‌ బియ్యం తరుగునకు ఇక చెక్‌ పడనుంది. ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల్లో జరిగే దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రజా పంపిణీలో పాటించే సాంకేతికతను వీటిల్లోనూ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల నుంచే రేషన్‌ డీలర్లకు బయోమెట్రిక్‌ అమలు చేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు ప్రతి నెల మండలస్థాయి గిడ్డంగికి వెళ్లి తన దుకాణంలోని కార్డుల ఆధారంగా కచ్చితమైన తూకంతో బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2081 రేషన్‌ దుకాణాలకు ఈ నెల నుంచి బయోమెట్రిక్‌ ఆధారంగా పంపిణీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు.

దోపిడీపై ఫిర్యాదులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల నుంచి అన్ని రేషన్‌ దుకాణాలకు బియ్యాన్ని లారీల్లో పంపిస్తున్నారు. ప్రతి నెల తక్కువగా వస్తున్నాయని,  50 కిలోల బస్తాలో 44-49 కిలోలే ఉంటున్నాయని డీలర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. మండలస్థాయి గోదాముల్లో గన్నీ సంచులకు కావాలనే రంధ్రాలు చేసి బియ్యం కిందపడిపోయే విధంగా చేస్తున్నారనే ఆరోపణలూ వచ్చాయి. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం డీలర్లకూ బయోమెట్రిక్‌  విధానం అమలు చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులు అందులో వేలిముద్ర వేసినప్పుడు ఈ-పోస్‌కుచ వేయింగ్‌ యంత్రానికి ఎలా అనుసంధానం చేశారో.. అదే విధంగా ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల్లోనూ అమలు చేయనున్నారు. గతంలో పాఠశాలలకు బియ్యం పంపిణీ చేసినప్పుడు తూకం తక్కువగా వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో ప్రధానోపాధ్యాయులకు ఇదే విధానం అమలు చేశారు. హెచ్‌ఎంలు ఎంఎల్‌ఎస్‌ కేంద్రాలకు వెళ్లి రావడంతో పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో సీఆర్పీలకు బయోమెట్రిక్‌ అప్పగించారు.

ఇంకా రేషన్‌ దుకాణాలకు వెళ్లని బియ్యం

డీలర్లకు బయోమెట్రిక్‌ విధానంలో ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల్లో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల్లో ఒక సారికి 50 క్వింటాళ్ల బియ్యం వరకు తూకం వేసే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక డీలర్‌ 250 క్వింటాళ్ల బియ్యం పొందాలంటే అయిదు సార్లు బమోమెట్రిక్‌ చేయాల్సి వస్తోంది. దీని వల్ల తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. అదే విధంగా ఒక సారి 50 క్వింటాళ్లు కాంటామీద వేసేందుకు హమాలీలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కాంటాపైన బియ్యం బస్తాల ఎత్తు పెరగడంతో హమాలీలకు కష్టాంగా మారింది. దీంతో నల్గొండ జిల్లాలో 450 చౌకధర దుకాణాలకు, సూర్యాపేటలో 68, యాదాద్రిలో 35 దుకాణాలకు మాత్రమే బియ్యం సరఫరా జరిగింది.

ఈ నెలకు బయోమెట్రిక్‌ మినహాయింపు

ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల్లో డీలర్ల బయోమెట్రిక్‌ విధానం అమలులో సమస్యలు ఏర్పడ్డాయి. సమస్యలను పరిష్కరించి కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ఈ నెల బియ్యం సరఫరాలో డీలర్ల బయోమెట్రిక్‌కు మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల బియ్యాన్ని డీలర్ల బయోమెట్రిక్‌ లేకుండా సరఫరా చేయాలని ఆదేశించింది.


గిడ్డంగికి వెళ్లాల్సిందే
- వెంకటేశ్వర్లు, డీఎస్‌వో నల్గొండ

ప్రక్రియ ప్రారంభించాం. ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల్లో కాంటాల్లో తూకానికి సంబంధించి కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే వాటిని అధిగమించి ముందుకెళ్తాం. ప్రస్తుతం ఈనెలకు సంబంధించి ఇప్పటికే 50 శాతం దుకాణాలకు డీలర్ల బయోమెట్రిక్‌తో బియ్యం సరఫరా చేశాం. జాప్యం ఏర్పతున్నందున ప్రభుత్వం ఈ నెలకు సంబంధించి బయోమెట్రిక్‌ లేకుండా సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల నుంచి డీలర్లు ఎంఎల్‌ఎస్‌ కేంద్రాలకు వచ్చి బమోమెట్రిక్‌ చేసి బియ్యం తూకం చూసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని