logo

మరణంవైపే.. మనసు పయనం

వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవల ఇలాంటి హత్యలు కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు జిల్లాలో రాజకీయ హత్యలు ఎక్కువగా ఉండేవి.

Published : 09 Mar 2023 05:12 IST

పెరిగిపోతున్న వివాహేతర, భూతగాదాల హత్యలు
సూర్యాపేట నేరవిభాగం, నల్గొండ నేరవిభాగం, భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే

వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవల ఇలాంటి హత్యలు కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు జిల్లాలో రాజకీయ హత్యలు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం వివాహేతర సంబంధాలు, భూవివాదాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో కుటుంబ సభ్యులు దిక్కులేని వారుగా మారుతున్నారు. జీవితాలను చీకటిమయంగా మార్చుకుంటున్నారు. తల ఎత్తుకోలేక కొంత మంది ఉన్న ఊరినే వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొంత మంది అక్రమ సంబంధాల ఏర్పాటు చేసుకొని దారుణాలకు ఒడిగడుతుంటే.. మరికొందరు ఆస్తుల కోసం రక్త సంబంధీకులనే బలి తీసుకుంటున్నారు.

ఘటనలు ఇలా..

నల్గొండ జిల్లా కేంద్రంలోని గంగవారిగూడెం రోడ్డులో ఆరు నెలల క్రితం చిన్న గట్టు తగాదాలో సొంత తమ్ముడి కుమారులే పెద్దనాన్నను హత్య చేశారు. అదే తగాదాలో మరుసటి రోజే ప్రతీకారంగా మృతుడి కుమారుడు చిన్నాన్నను హత్య చేశాడు.
పెద్దమనుషుల్లో కూర్చొని చర్చించుకుంటే సమసిపోయే చిన్న వివాదం ఇద్దరు కుటుంబ పెద్దలను కోల్పోవాల్సి రావడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.

ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం ఏపూర్‌ గ్రామానికి చెందిన గుండ్లపల్లి వీరయ్య (40)ను అదే గ్రామంలో  దాయాది కుటుంబానికి చెందిన గుండ్లపల్లి నర్సయ్య ఇరవై రోజుల క్రితం దారుణంగా హత్య చేశాడు. పొలం వద్ద నిద్రిస్తుండగా గొడ్డలితో తల, మొండెం వేరు చేసి హతమార్చాడు. వీరయ్య హత్యకు అక్రమ సంబంధమే కారణమని మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవేశంలో నిర్ణయం తీసుకొని హత్య చేసినట్లు నర్సయ్య పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.

భువనగిరి పట్టణం తాతానగర్‌కు చెందిన వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో భర్త తినే ఆహారంలో విషం కలిపి హత్య చేశాడు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఈ ఘటనతో వీరి కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ఈ కేసులో హతురాలి తల్లి సైతం నిందితురాలిగా ఉండటం గమనార్హం.

 ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం తుమ్మలపెన్‌పహాడ్‌లో ఏడాది క్రితం ఆస్తి పంపిణీ చేయడం లేదన్న కోపంతో అన్న, తమ్ముడు కలిసి కన్న తండ్రిని హతమార్చారు. కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. ఇదే మండలం ఏనుబాములలోనూ పది నెలల క్రితం ఇదే తరహాలో కుమారుడి చేతిలో తండ్రి హత్యకు గురయ్యాడు.


తొందరపాటు సరికాదు

డాక్టర్‌ శివరామకృష్ణ, మానసిక వైద్య నిపుణులు, నల్గొండ

ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా కొందరు క్షణికావేశానికి లోనై ప్రాణాలు తీసుకునే స్థాయి వరకు వెళ్తున్నారు. పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే వాటికి హత్యలకు పాల్పడుతూ జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు. హత్యలకు గురవుతున్న వారిలో ఎక్కువగా దగ్గరి సంబంధీకులే ఉంటున్నారు.  ఒకరికి మించి వివాహేతర సంబంధాలు కొనసాగించడం కొందరు గొప్పగా ఫీలవుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పరువు పోయి ఏం చేయాలో తెలియక హత్యలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు సమీపంలోని మాససిక వైద్యులను సంప్రదిస్తే సమస్యలకు కొంత పరిష్కారం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని