logo

రాలింది కాత.. అన్నదాతకు గుండెకోత

జిల్లాలో మామిడి సాగు చేస్తున్న రైతులు నష్టాల బారిన పడుతున్నారు. ఒక వైపు తెగుళ్ల బెడద.. మరో వైపు వడగళ్ల వర్షాలు కోలుకోని దెబ్బతీశాయి

Published : 22 Mar 2023 04:16 IST

నష్టాలను చవిచూస్తున్న మామిడి రైతులు

తిరుమలగిరి మండలం మామిడాలలో నేలరాలిన మామిడి కాయలను పరిశీలిస్తున్న డీఏవో డి.రామారావునాయక్‌, ఏవో డి. వెంకటేశ్వర్లు

సూర్యాపేట కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో మామిడి సాగు చేస్తున్న రైతులు నష్టాల బారిన పడుతున్నారు. ఒక వైపు తెగుళ్ల బెడద.. మరో వైపు వడగళ్ల వర్షాలు కోలుకోని దెబ్బతీశాయి. తెగుళ్ల వల్ల బాగా కాసిన పూత రాలిపోగా.. దక్కిన కొన్ని కాయలు వానపాలయ్యాయి. రెండేళ్లుగా నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులు.. ఈ సారైనా ఆశించిన స్థాయిలో లాభాలను చూడాలనుకున్నారు. కాత అధికంగా ఉందని, ధరలుంటే కలిసి వస్తుందనుకునే లోపు అకాల వర్షాలు నిండాముంచాయి. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

1300 ఎకరాల్లో నష్టం

జిల్లాలో 12 వేల ఎకరాల్లో మామిడి సాగు చేపట్టారు. ప్రధానంగా తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం, మద్దిరాల, నూతనకల్‌, చివ్వెంల, ఆత్మకూర్‌(ఎస్‌), అర్వపల్లి మండలాల్లో అధికంగా సాగవుతోంది. గతంలో తెగుళ్ల కారణంగా కొంత వరకు నష్టపోగా.. ఇటీవల రెండ్రోజులు కురిసిన వడగళ్ల వర్షానికి 1300 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. వర్షం వల్ల రూ.30 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. వడగళ్ల ధాటికి చెట్టు మీద ఉన్న కాయ కూడా నల్లబారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌ పరిస్థితులను చూస్తే పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూత దశ దాటి కాత వచ్చే సమయంలో తామర పురుగుతోపాటు ఇతర తెగుళ్ల నివారణకు ఇబ్బడిముబ్బడిగా పురుగు మందు పిచికారి చేశారు. ఒక్కో రైతు ఒక్కసారికి సుమారు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చిస్తున్నారు. ఒక్కొక్కరు ఇప్పటికే అయిదుసార్లు పురుగు మందులు పిచికారి చేసినా ఆశించిన ఫలితం కానరావడం లేదు. సాధారణంగా ఎకరాకు 10 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా.. ప్రస్తుతం కనీసం రెండు, మూడు టన్నులూ వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.


నష్టాన్ని అంచనా వేశాం
- శ్రీధర్‌, జిల్లా ఉద్యాన శాఖాధికారి, సూర్యాపేట

వడగళ్ల కారణంగా దెబ్బతిన్న మామిడి తోటలను పరిశీలించాం. రైతులతో మాట్లాడి నష్టాన్ని అంచనా వేశాం. ఈ సారి కాత బాగుంది. కానీ, వడగళ్ల కారణంగా చాలా వరకు తోటలు దెబ్బతిన్నాయి. చెట్టు మీది కాయలపై వడగళ్లు పడటంతో నల్లబారే అవకాశం ఉంటుంది. దీంతో నష్టం పెరగవచ్చు. పంట నష్టంపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని