logo

పరీక్ష లేకుండా ప్రవేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశం కోసం గతేడాది వరకు పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించేవారు.

Published : 26 Mar 2023 04:45 IST

ఇంటర్‌లో చేరికపై సాంఘిక సంక్షేమశాఖ గురుకుల సంస్థ నిర్ణయం

నడిగూడెం, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశం కోసం గతేడాది వరకు పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించేవారు. ఆ పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయించేవారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశ పరీక్ష విధానాన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఎత్తేసింది. 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ప్రవేశానికి పరీక్ష నిర్వహించడం లేదు. కేవలం గురుకుల పాఠశాలల్లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులకు మాత్రమే అదే గురుకుల కళాశాలలో ప్రవేశం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆయా పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశం కోసం అంతర్జాలం ద్వారా దరఖాస్తులు చేస్తున్నారు. దీంతో ఇతర పాఠశాలల్లో పదోతరగతి చదివిన విద్యార్థులకు గురుకులాల్లో ఇంటర్‌ చదవాలనే ఆశ ఆడియాసగా మిగలనుంది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో 20 ఇంటర్‌ గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఈ విధానంతో మిగతా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పునరాలోచన చేసి, ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ గల విద్యార్థులకు గురుకుల కళాశాలల్లో ప్రవేశం కలిగేలా చూడాలని వారు కోరుతున్నారు.

ఈ ఏడాది నుంచి ప్రవేశ పరీక్ష ఉండదు... హెచ్‌.అరుణకుమారి, జిల్లా సమన్వయకర్త,  నల్గొండ... సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీవోఈ) కళాశాలల్లో ప్రవేశం కోసమే గత నెలలో ప్రవేశ పరీక్ష నిర్వహించాం. సాధారణ గురుకుల కళాశాలల్లో ప్రవేశం కోసం ఈ ఏడాది నుంచి పరీక్ష నిర్వహించడం లేదు. ఇతర పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు సైతం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తాం. త్వరలో సీట్ల భర్తీపై సంస్థ నుంచి మార్గదర్శకాలు జారీ అవుతాయి. దీని ఆధారంగా కళాశాలల్లో ప్రవేశాలు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని