logo

ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు

జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల ద్వారా కొనేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.

Published : 27 Mar 2023 03:16 IST

 వచ్చే నెల రెండో వారంలో కేంద్రాలు ప్రారంభం

పెన్‌పహాడ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు (పాతచిత్రం)

సూర్యాపేట పట్టణం, ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల ద్వారా కొనేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. త్వరలో వరి కోతలు ప్రారంభం కానుండటంతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా కొనుగోళ్లకు సిద్ధం చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ‘ఏ’ గ్రేడ్‌ రకం ధాన్యానికి రూ.2060, కామన్‌ రకం ధాన్యానికి రూ.2040 చెల్లించనున్నారు. తేమ శాతం ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని అధికారులు కోరుతున్నారు. రైతులకు ఎలాంటి సమస్యలున్నా ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు కంట్రోల్‌ రూంలో ఫిర్యాదులు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

276 కొనుగోలు కేంద్రాలు

జిల్లాలో ఏడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా జిల్లాలో 23 మండలాల్లో ధాన్యం కొనుగోళ్లకు ఐకేపీ, సహకార కేంద్రాలు 276 ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే పీఏసీఎస్‌ సీఈవోలకు అవగాహన కల్పించారు. ఎలాంటి అక్రమాలకు, రైతులకు ఇబ్బందులకు తావులేకుండా, కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. వేసవి కావడంతో నిరంతరం తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించనున్నారు.

గోనె సంచుల కొరత తలెత్తకుండా..

ఐకేపీ, సహకార కేంద్రాల్లో గతంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆ సమస్యలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తేమశాతం నిర్ధారించే పరికరాలు, తూకం వేసే యంత్రాలు, ధాన్యం శుభ్రం చేసే ప్యాడీ క్లీనర్లు కొనుగోళ్లకు సరిపడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గోనె సంచుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ధాన్యం రవాణా చేసేందుకు లారీలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. రైతుల వివరాలు, ట్రక్‌ షీట్లో వివరాల నమోదు, చెల్లింపుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయనున్నారు.

చెల్లింపుల్లో ‘పేట’కు రెండోస్థానం

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల ఖాతాల్లో నగదు జమలో జాప్యం లేకుండా అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వానాకాలంలో రైతుల ఖాతాల్లో రెండు రోజుల్లోనే డబ్బులు పడ్డాయి. రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా నగదు చెల్లింపుల్లో రెండో స్థానంలో నిలిచింది. యాసంగిలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు