logo

పకడ్బందీగా పది పరీక్షల నిర్వహణ

ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభం కానున్న పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) బిక్షపతి వెల్లడించారు.

Published : 31 Mar 2023 04:39 IST

 ‘ఈనాడు’తో డీఈవో బిక్షపతి

ఈనాడు, నల్గొండ : ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభం కానున్న పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) బిక్షపతి వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులతో పాటూ ఇన్విజిలేటర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్‌, పోలీసులెవరూ చరవాణులు తీసుకురావొద్దని, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణపై ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు

జిల్లాలోని 107 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 19,414 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందులో 19,234 మంది రెగ్యూలర్‌, 180 మంది ప్రైవేటు విద్యార్థులు. అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సిన మంచినీరు, బెంచీలు, లైట్లు, ఫర్నిచర్‌ ఏర్పాటు చేశాం. మూత్రశాలలు అందుబాటులో ఉన్నాయి. చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదిలో సీసీ కెమెరాలు ఉంటాయి. వాటి పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలు తెరుస్తాం. విద్యార్థులు, తల్లిదండ్రులు హాల్‌టికెట్‌ ప్రకారం పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో ముందు రోజు సాయంత్రమే చూసుకోవాలి. విద్యార్థులను అరగంట ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తాం.  


సర్కారు బడులపై ప్రత్యేక శ్రద్ధ

సర్కారు బడుల్లో మెరుగైన ఫలితాల కోసం డిసెంబరు 1 నుంచే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. సబ్జెక్ట్‌ నిపుణులతో వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేశాం. ఉదయం, సాయంత్రం స్టడీ అవర్‌లను నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పరంగా వారికి ఉదయం స్నాక్స్‌ ఏర్పాటు చేశాం. జిల్లాకు రూ.40 లక్షలు మంజూరు కాగా...అన్ని పాఠశాలలకు పంపించి ఆ మేరకు ఖర్చు చేశాం. చదువులో కొంత చురుగ్గా లేని విద్యార్థులకు ప్రభుత్వం తరఫున ‘అభ్యాస దీపిక’లను అందజేసి వారు ఉత్తీర్ణులు అయ్యే విధంగా ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో చొరవ చూపుతున్నారు.


మాస్‌ కాపీయింగ్‌పై నిరంతర నిఘా

పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తారు. సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలను మూసి వేయిస్తాం. ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ బృందాలు జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తాయి. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో స్థానిక తహసీల్దార్‌, ఎస్‌ఐతో పాటూ డీఈవో నెంబరు ఉంటుంది. ఇబ్బందులుంటే ఆ నెంబర్లకు ఫోన్‌ చేయొచ్చు. కొన్ని పాఠశాలలు ఒంటిపూట బడులు నిర్వహించడం లేదని మా దృష్టికి వస్తే వారిని హెచ్చరించాం. పదో తరగతి వారికి మాత్రమే ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఒకటి నుంచి తొమ్మిది వరకు తప్పకుండా ఒంటిపూట బడులను కొనసాగించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని