logo

అటకెక్కిన ఆన్‌లైన్‌..!

పురపాలికల్లో దుకాణాల ఆన్‌లైన్‌ విధానం అటకెక్కింది. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నింటికీ ప్రభుత్వం ట్రేడ్‌ లైసెన్సు తప్పనిసరి చేసింది

Published : 31 May 2023 05:12 IST

పురపాలికల్లో ట్రేడ్‌ లైసెన్స్‌ పన్ను వసూలుపై అశ్రద్ధ

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే

సూర్యాపేటలోని నల్లాలబావి రోడ్డులో దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు

పురపాలికల్లో దుకాణాల ఆన్‌లైన్‌ విధానం అటకెక్కింది. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నింటికీ ప్రభుత్వం ట్రేడ్‌ లైసెన్సు తప్పనిసరి చేసింది. ఇన్నాళ్లూ అవసరమున్న దుకాణదారులు మాత్రమే అనుమతి పత్రం తీసుకొనేందుకు ముందుకొచ్చేవారు. లైసెన్సుల జారీలో నిర్లక్ష్యం, అరకొర ఆన్‌లైన్‌ విధానంతో ఆదాయ లక్ష్యం నీరుగారుతోంది.

ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో పురపాలిక ఆదాయానికి గండిపడుతోంది. ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో దాదాపు 29,876 దుకాణాలు ఉన్నాయి. వీటిలో 14,187 దుకాణాలను మాత్రమే అధికారులు ఆన్‌లైన్‌ చేశారు. ఏటా బల్దియాలకు రూ.కోట్ల ఆదాయం సమకూరాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో భారీగా గండిపడుతోంది.

పెరుగుతున్న దుకాణాలు..

ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల విస్తీర్ణంతో పాటు దుకాణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకప్పుడు రహదారులు, ప్రధాన కేంద్రాలకే పరిమితమైన వ్యాపార సంస్థలు, దుకాణాలు, హోటళ్లు, ఫలహారశాలలు కాలనీల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఆ స్థాయిలో ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, కనీస అవసరాలు కల్పించాల్సిన బాధ్యత పురపాలికపై పడింది. ఈ భారాన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, మెకానిక్‌, వండ్రంగి, వెల్డింగ్‌, ఎంటర్‌ప్రైజెస్‌, రైస్‌మిల్లులు, పూల దుకాణాలు, తదితర వ్యాపార సంస్థల నుంచి పన్ను వసూలు చేయాల్సి ఉంది. వాటిని గుర్తించి ఆన్‌లైన్‌ చేయడం ద్వారా పన్ను వసూలు చేసి పురపాలికకు ఆదాయాన్ని సమకూర్చాల్సి ఉంది. ఈ విషయంలో అధికారులు అవసరమైన మేర చొరవ చూపటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పురపాలికల్లో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. పూర్తి స్థాయిలో దుకాణాలను ఆన్‌లైన్‌ చేసేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని