logo

బడిబాటకు వేళాయె..!

కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యంలో సర్కారు బడులను కాపాడుకోవడం విద్యాశాఖ, ఉపాధ్యాయులకు కత్తిమీద సాములా తయారైంది.

Published : 01 Jun 2023 03:11 IST

 జూన్‌ 3 నుంచి 17 వరకు అంశాల వారీగా కార్యక్రమాలు
 రాజపేట, నల్గొండ విద్యావిభాగం, హుజూర్‌నగర్‌, సూర్యాపేట (మహాత్మాగాంధీ రోడ్డు), న్యూస్‌టుడే

రాజపేటలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల ర్యాలీ (పాతచిత్రం)

కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యంలో సర్కారు బడులను కాపాడుకోవడం విద్యాశాఖ, ఉపాధ్యాయులకు కత్తిమీద సాములా తయారైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచి విద్యార్థులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభ దశలో ‘ఆచార్య జయశంకర్‌ బడిబాట’ కార్యక్రమానికి చేపట్టనుంది. ఈసారి జూన్‌ 3 నుంచి 17 వరకు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను చైతన్యపరచాలని సంకల్పించింది. సర్కారు బడుల్లో ప్రవేశాలసంఖ్య పెంచాలనే ధ్యేయంతో 15రోజులపాటు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని విద్యాశాఖఅధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

మన ఊరు -మన బడితో ప్రయోజనం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం పేరుతో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 1,097 పాఠశాలల్లో సుమారు రూ.330 కోట్ల మేర ఖర్చుతో పలు నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యంగా పాత బడులకు మరమ్మతులు, తరగతి గది, వంట గదులు, ప్రహరీల నిర్మాణం, శౌచాలయాల మరమ్మతులు, నూతన నిర్మాణాలకు ఈ నిధులను వెచ్చించి వసతులు కల్పించనున్నారు. ఇందులో కొన్ని నిర్మాణాలు పూర్తికాగా మరికొన్ని ప్రగతిలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  8,9,10 తరగతుల విద్యార్థుల ప్రయోజనార్థం డిజిటల్‌ బోధన చేపట్టేందుకు ఐఎఫ్‌ఎస్‌ (ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ స్క్రీన్‌) ఎంపిక చేసిన పాఠశాలల్లో టీవీలు ఇతర పరికరాల అమరిక ఇదివరకే పూర్తి చేశారు.

వసతులు ఇలా..

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించేందుకు ఏటా ‘బడిబాట’ నిర్వహిస్తున్నప్పటికీ గతంలో పెద్దగా సత్ఫలితాలు వచ్చేవి కావు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యాలయాల సుందరీకరణకు సర్కారు ప్రాధాన్యమిస్తోంది. నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన, కార్పొరేట్‌ విద్యాలయాల్లో మాదిరిగా ఏకరూప దుస్తులు, ఉచితంగా మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాల పంపిణీతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుంది. ఈ అంశాలన్నింటిపైనా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే దిశగా కృషి చేయాలని విద్యాశాఖ భావిస్తుంది.

లక్ష్యాలు ఇవీ..

* బడి ఈడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం.
* ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెంచడంతో పాటు గుణనాత్మక విద్యను అందించడం
* తక్కువ పాఠశాలలున్న పాఠశాలల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యంతో నమోదు శాతాన్ని పెంచడం
* బడి బయట పిల్లలను గుర్తించి వయస్సుకు తగిన తరగతుల్లో ప్రవేశాలు కల్పించడం
* 5 నుంచి 7వ తరగతి విద్యార్థులందరినీ ఉన్నత పాఠశాలల్లో నమోదు చేయించడం
* సమాజ భాగస్వామ్యం, మద్ధతుతో సర్కారు బడులను బలోపేతం చేయడం
* బాలికల విద్య ప్రాధాన్యాన్ని గుర్తెరిగి అమ్మాయిలను పాఠశాలల్లో చేర్పించడం
* అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్ల పిల్లలను గుర్తించి సమీప సర్కారు బడుల్లో ప్రవేశాలు కల్పించడం
* జూన్‌ 3 నుంచి 9 వరకు గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమం చేపట్టడం
* జూన్‌ 12 నుంచి 17 వరకు నిర్ధారించిన రోజువారీ కార్యక్రమాలు నిర్వహించడం

తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం..

రవీందర్‌ నాయక్‌, ప్రధానోపాధ్యాయుడు, కొల్లూరు

ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు సర్కారు పాఠశాలల్లో ప్రభుత్వపరంగా విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన విద్య, భోజనం, ఏకరూప దుస్తులు, చదువు, రాత పుస్తకాలు ఉచితంగా అందుతున్న తీరును తల్లిదండ్రులకు, విద్యార్థులకు వివరించి అవగాహన కల్పిస్తాం. ప్రైవేటుకు ధీటుగా అందుతున్న సదుపాయాలు, విద్యా ప్రమాణాల విషయాన్ని వివరించి నమోదు చేయిస్తాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని