logo

సమస్యలపై ప్రశ్నించె.. పరిష్కారాలు చర్చించె

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ.. రైతులకు ప్రయోజనం చేకూర్చుతున్నామని జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు.

Published : 01 Jun 2023 03:11 IST

వాడీవేడిగా సాగిన యాదాద్రి జడ్పీ సమావేశం

సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ.. రైతులకు ప్రయోజనం చేకూర్చుతున్నామని జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

* ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులపై సమావేశంలో వాడీవేడి చర్చ కొనసాగింది. కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేశాక రైతులకు తక్‌పట్టీలు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌లీడర్‌ డాక్టర్‌ కుడుదుల నగేష్‌, కో- ఆప్షన్‌ సభ్యుడు ఖలీల్‌ డిమాండ్‌ చేశారు. కొనుగోలు ప్రక్రియ ముగిసినప్పటికీ రైతులను మిల్లుల వద్దకు పిలిచి కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించే లారీల డ్రైవర్లు రైతుల నుంచి ఒక్కో బస్తా పేరిట రూ.2 నుంచి రూ.4 వసూలు చేస్తున్నారని, ఇవ్వని పక్షంలో ధాన్యం తరలించడం లేదని ఆరోపించారు. తూకం, తేమ, తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.

జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్‌ పమేల సత్పతి మాట్లాడారు. ఈ సీజన్‌లో నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటి వరకు 2.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మిల్లుల్లో స్థలం లేక ధాన్యం నిలువ చేసేందుకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రైతులకు ఇప్పటి వరకు రూ.142 కోట్లు చెల్లించామని, మరో రూ.110 కోట్లు కావాలని ప్రభుత్వానికి కోరామని కలెక్టర్‌ అన్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎవరికి డబ్బులు ఇవ్వవద్దని పౌరసరఫరాల సంస్థ డీఎం గోపికృష్ణ అన్నారు.

* గ్రామ పంచాయతీల్లో విద్యుత్‌ సదుపాయం కల్పించేందుకు డబ్బులు చెల్లించాలని విద్యుత్‌ అధికారుల చెబుతున్నారని సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆలేరులోనే డిగ్రీ చదివే విద్యార్థులు 2000కు పైగా ఉంటారని, వారిలో పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. అనాథలకు గురుకులాల్లో ప్రవేశాలు కల్పించాలని సభ్యుడు వెంకట్‌రెడ్డి కోరారు. ప్రభుత్వ విద్యాలయాలకు మిషన్‌ భగీరథ నీటి కనెక్షన్లు ఇవ్వాలని ఎంపీపీ నరాల నిర్మల, సభ్యురాలు అనూరాధ కోరారు. అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, సీఈవో కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో శ్రీనివాస్‌రావు, జడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి నగేష్‌, జ్యోతి, శారద, వీరమల్ల భాను, అనూరాధ, శ్రీశైలం పాల్గొన్నారు.

గైర్హాజరు...

అత్యధిక ప్రజాప్రతినిధులు సమావేశానికి గైర్హాజరు అయ్యారు. దీంతో సమావేశం సాదాసీదాగా కొనసాగింది. సమావేశానికి హాజరు కావాలని అధికారులు ప్రత్యేకంగా మంత్రి జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిషోర్‌లకు ఆహ్వానం పంపినప్పటికి ఎవరూ హాజరు కాలేదు. అన్ని మండలాల ఎమ్పీపీలకు, జడ్పీటీసీలకు అధికారులు కబురు పెట్టినప్పటికీ అత్యధిక ఎంపీపీలు, కొందరు జడ్పీటీసీ సభ్యులు సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. సమావేశానికి పలువురు జిల్లా అధికారులు గైర్హాజరై తమ కింది ఉద్యోగులను సమావేశానికి పంపించారు.

సమావేశానికి హాజరైన సభ్యులు, అధికారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని