logo

వీరుల బలిదానం.. వీర్ల చెరువు

ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని చెరువుకు చారిత్రక నేపథ్యంతో వీర్ల చెరువు అని పేరు. 1870 ప్రాంతంలో స్థానిక జాగీర్‌దార్‌ యాఖూబ్‌ అలీ ఆత్మకూరులో చెరువు నిర్మించేందుకు నిర్ణయించారు.

Published : 02 Jun 2023 04:48 IST

ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని చెరువుకు చారిత్రక నేపథ్యంతో వీర్ల చెరువు అని పేరు. 1870 ప్రాంతంలో స్థానిక జాగీర్‌దార్‌ యాఖూబ్‌ అలీ ఆత్మకూరులో చెరువు నిర్మించేందుకు నిర్ణయించారు. నల్గొండ సమీపంలోని పానగల్‌ నుంచి సుమారు 70 మంది కూలీలను రప్పించాడు. 125 ఎకరాల్లో చెరువును తవ్వినందుకు కూలీగా రెండు తూముల (సుమారు 40 కిలోల కొల పాత్ర) నాణేలు ఇస్తాననడంతో కూలీలు సంతోషంగా ఒప్పుకున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఒప్పందం ప్రకారం రెండు తూముల నాణేలు ఇవ్వమని కూలీలు అడిగారు. జాగీర్‌దారు మాత్రం తూముకు బదులు గొడ్డలి తూము (గొడ్డలికి ఉండే రంధ్రం)తో కొలిచి నాణేలను ఇచ్చాడు. కూలీలు జాగీరును బతిమిలాడినా కనికరం చూపలేదు. జాగీరును ఎదురించలేక, స్వగ్రామం పానగల్‌కు వెళ్లలేక చెరువును తొవ్విన గడ్డపారలతోనే పొడుచుకుని ఆత్మబలిదానాలు చేసుకున్నారు. చివరికి ఒక కూలీ ప్రాణాలతో మిగిలాడు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలిపేందుకు చెరువు మత్తడి వద్ద బండలపై ఆత్మహత్య దృశ్యాలను చెక్కి జాగీర్‌దారును శపించి తాను బలవన్మరణం చెందాడు. వీరుల బలిదానంతో ఆత్మకూరు చెరువుకు వీర్ల చెరువుగా పేరువచ్చింది.

ఆత్మకూరు(ఎం) వీర్ల చెరువు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని