logo

6న దండుమల్కాపురానికి మంత్రి కేటీఆర్‌ రాక!

యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపురం పారిశ్రామిక పార్కుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ నెల 6న రానున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఆ రోజు పారిశ్రామిక వాడలో సంబరాలు జరిపే కార్యక్రమం ఉంది.

Published : 03 Jun 2023 05:04 IST

పారిశ్రామిక పార్కులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ భవనం ఇదే..

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపురం పారిశ్రామిక పార్కుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ నెల 6న రానున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఆ రోజు పారిశ్రామిక వాడలో సంబరాలు జరిపే కార్యక్రమం ఉంది. దీంతో పాటు దండుమల్కాపురం పారిశ్రామిక పార్కులో రూ.40 కోట్లతో నిర్మించిన కామన్‌ఫెసిలిటీ సెంటర్‌ భవనాలను, ఆడిటోరియం, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఐలా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే పారిశ్రామిక పార్కులో 60 పరిశ్రమలు ఉత్పత్తులను ప్రారంభించాయి. ఆ ఉత్పత్తుల ప్రదర్శనశాలను కేటీఆర్‌ పరిశీలిస్తారు. పారిశ్రామిక పార్కులో పరిశ్రమల ఉత్పత్తుల తర్వాత వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసే సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. నూతనంగా పారిశ్రామిక పార్కు పక్కనే సర్వే నంబరు 617లో 106 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే బొమ్మల పార్కు క్లస్టర్‌కు శంకుస్థాపన చేస్తారు. ఉదయం పది గంటలకు మంత్రి కేటీఆర్‌ పర్యటన ప్రారంభమవుతుంది. బుధవారం కేటీఆర్‌ పర్యటన అధికారికంగా ఖరారు కానుందని తెలంగాణ పరిశ్రమల సమాఖ్య(టీఫ్‌) అధ్యక్షుడు కె.సుధీర్‌రెడ్డి, కార్యదర్శి గోపాల్‌రావు, టాయ్స్‌ క్లస్టర్‌ డైరెక్టర్‌ శ్రీహరిరెడ్డి ‘న్యూస్‌టుడే’తో తెలిపారు. తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) అధికారులు కూడా మంత్రి కేటీఆర్‌ పర్యటనను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేస్తున్నారు.

పారిశ్రామిక వాడల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు... తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నెల 6న పారిశ్రామిక వాడల్లో సంబరాలను నిర్వహించనుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని టీఎస్‌ఐఐసీ అధికారులు ఉమ్మడి జిల్లాలోని 12 పారిశ్రామిక వాడల్లో సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దండుమల్కాపురం పారిశ్రామిక పార్కుతో పాటు భువనగిరి, రాఘరావుపేట, చిట్యాల, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, నేరేడుచర్ల ప్రాంతాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో సంబరాలు నిర్వహిస్తారు. పారిశ్రామిక వాడలను తోరణాలతో, విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. సభలను నిర్వహించి ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణ సాధించాక పారిశ్రామిక పురోగతిపై వివరిస్తారు. పరిశ్రమలకు విద్యుత్‌ సమస్య లేకుండా ఎలా అందిస్తున్నారో సవివరంగా చెబుతారు.
మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్న

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని