logo

కోతలే ఎక్కువ..!

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకు ప్రసవం తరువాత కేసీఆర్‌ కిట్ల పంపిణీతో పాటు అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేల చొప్పున లబ్ధిదారులకు అందిస్తుంది.

Published : 04 Jun 2023 04:12 IST

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకు ప్రసవం తరువాత కేసీఆర్‌ కిట్ల పంపిణీతో పాటు అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేల చొప్పున లబ్ధిదారులకు అందిస్తుంది. దీంతో పాటు ఈ నెల 14 నుంచి గర్భిణులకు కేసీఆర్‌ పౌష్టికాహార కిట్లను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తూ ఉన్నారు. అక్కడకు వెళ్లిన గర్భిణులకు శస్త్ర చికిత్సలే అధికంగా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంతో పాటు, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జున సాగర్‌, నకిరేకల్‌ ఏరియా ఆసుత్రులతో పాటు 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రస్తుతం ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రసవాల్లో గత మూడు నెలల క్రితం 18వ స్థానంలో ఉన్న జిల్లా ప్రస్తుతం 10వ స్థానానికి పెరిగింది. గ్రామ, పట్టణ స్థాయిల్లో ఆశాలు, ఏఎన్‌ఎంలు గర్భిణులకు సూచనలు చేస్తున్నా.. కొంత మంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. ప్రైవేటుకు వెళ్తున్న వారికి 90 శాతం వరకు శస్త్రచికిత్సలే జరుగుతున్నాయి. ముందుగానే రూ.40 వేల నుంచి రూ.45వేల వరకు ప్యాకేజీలు మాట్లాడుకొని శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు, కింది స్థాయి సిబ్బంది కమీషన్ల కోసం బాధితులను ప్రైవేటుకు పంపుతున్నారనే విమర్శలున్నాయి.  

 అవగాహన పెంచుతున్నాం

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాం.గర్భిణులుగా పేరు నమోదు చేసుకున్న సమయం నుంచి అన్నిరకాలుగా వారికి సేవలు అందిస్తున్నాం. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నాం. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్‌ నర్సుల  కొరత ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో భర్తీ  చేయాడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రైవేటులో శస్త్రచికిత్సలు తగ్గించి సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాసుపత్రి నుంచి బాధితులను ప్రైవేటుకు పంపేవారి సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

అన్నిమల్ల కొండల్‌రావు,డీఎంహెచ్‌వో, నల్గొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని