logo

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

తాళంవేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు  చేసినట్లు నల్గొండ ఎస్పీ అపూర్వరావు తెలిపారు.

Published : 22 Sep 2023 03:29 IST

వివరాలు తెలుపుతున్న నల్గొండ ఎస్పీ అపూర్వరావు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: తాళంవేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు  చేసినట్లు నల్గొండ ఎస్పీ అపూర్వరావు తెలిపారు. వారి నుంచి రూ. 14.20 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నల్గొండలో గురువారం ఆమె కేసు వివరాలు వెల్లడించారు. చెన్నైలో నివాసం ఉంటున్న కె.ఇమ్రాన్‌ఖాన్‌(37), ఇ.సూర్య(38) కొంత కాలంగా నల్గొండ, చౌటుప్పల్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, నార్కట్‌పల్లి, నకిరేకల్‌ ప్రాంతాల్లో మొత్తం 21 ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. నిందితుల్లో సూర్య తన 13 ఏళ్ల వయస్సు వరకు మిర్యాలగూడలో కుటుంబ సభ్యులతో ఉండేవాడు. అప్పట్లో ఇంటి నుంచి వెళ్లి పోయి చెన్నైలో సినిమా షూటింగ్‌లో కూలి పని చేస్తున్న క్రమంలో మద్యం షాపు వద్ద ఇమ్రాన్‌తో పరిచయం ఏర్పడింది. జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు దొంగతనాలు   ప్రారంభించారు. గత నెలలో నల్గొండలోని ముషంపల్లి రోడ్డులో ఉన్న ఇంట్లో ఆరు తులాల ఆభరణాలు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం పట్టణంలో ఇద్దరు అనుమానాస్పదంగా కన్పించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. వారి నుంచి 20 తులాల బంగారం ఆభరణాలు, కిలో వెండి వస్తువులు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు ఛేదించిన డీఎస్పీ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి, సీసీఎస్‌ సీఐ జితేందర్‌రెడ్డి, వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ, గౌరిదేవి విష్ణువర్ధనగిరి, లింగారెడ్డి, పుష్పగిరి, ఇమ్రాన్‌, నరేశ్‌లను ఎస్పీ అభినందించారు.


వ్యసనాలకు బానిసై యువకుడి ఆత్మహత్య

గోపాలకృష్ణ

హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: చెడు వ్యసనాలకు బానిసైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గోపాలపురంలో చోటు చేసుకుంది. ఎస్సై పి.హరికృష్ణ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. దాసరాజు గురవయ్య పెద్ద కుమార్తె అనంత రావమ్మకు గుడిబండకు చెందిన ఆత్కూరి రాధాకృష్ణతో 24 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి గోపాలకృష్ణ పుట్టిన తరువాత విడిపోయారు. అనంత రావమ్మ గోపాలపురం వచ్చి తల్లిగారి ఇంట్లో ఉంటూ హుజూర్‌నగర్‌లో ఇళ్లల్లో దుస్తులు ఉతుకుతూ జీవనం సాగిస్తోంది. గోపాలకృష్ణ (22) చెడు వ్యసనాలకు బానిసై తాగొచ్చి తరచూ తల్లిని ఇబ్బందులకు గురి చేస్తుండే వాడు. వ్యసనాలను మాన్పించేందుకు ఆసుపత్రుల్లో చూపిస్తున్నారు. తల్లి, పిన్నితో గొడవ పడి బుధవారం వారిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టి గేటు వేసుకున్నాడు. చాలా సేపటి వరకు గేట్‌ తీయక పోవడంతో ఎదురింటి వారు గోడపై నుంచి చూడగా చీరతో ఉరి వేసుకొని కనిపించాడు. కొందరు యువకులు వెళ్లి ఉరి తప్పించి హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గోపాలకృష్ణ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఎస్సై హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


అనుమానాస్పద స్థితిలో వివాహిత బలవన్మరణం

కొండమల్లేపల్లి, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన కొండమల్లేపల్లి మండలం సాగర్‌రోడ్డులో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి బంధువులు, పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక సాగర్‌రోడ్డులో రమావత్‌ హతీరాం-పద్మ దంపతులు నివాసముంటున్నారు. ఏడాదిన్నర క్రితం వారి కుమారుడు జగన్‌కు దామరచర్లకు చెందిన అంజలితో వివాహమైంది. వీరికి నాలుగు నెలల పాప ఉంది. కొంతకాలంగా అత్తమామలకు, ఈమెకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం భర్త పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లాడు. అంజలి తన నాలుగు నెలల పాపను పక్కనే ఉండే ఆడపడుచు వద్ద ఉంచి, తాము ఉండే గదిలోకి వెళ్లింది. సాయంత్రం వరకు బయటికి రాకపోవడంతో అత్త గదిలోకి వెళ్లి చూడగా ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. వెంటనే వారు మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విషయం బయటికి రాకుండా చూశారు. చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గురువారం వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి దస్లీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వీరబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని