logo

కరస్పాండెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ

నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి బాలికపై లైంగిక వేధింపుల ఘటన మరువక ముందే.. మరో దారుణం చోటు చేసుకుంది.

Published : 03 Dec 2022 02:23 IST

పాఠశాల ఎదుట బాలిక తల్లి ఆందోళన

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి బాలికపై లైంగిక వేధింపుల ఘటన మరువక ముందే.. మరో దారుణం చోటు చేసుకుంది. స్థానిక మాగుంట లేఅవుట్‌లోని మరో ప్రైవేటు స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై కరస్పాండెంట్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ తల్లి పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. తమకు అన్యాయం జరిగిందంటూ.. కరస్పాండెంట్‌ వాహనం ఎదుట విద్యార్థి తల్లి బైఠాయించి ఆందోళన చేపట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ కుమార్తె పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ చేస్తూ పట్టుబడిందనే నెపంతో కరస్పాడెంట్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆయనతో పాటు వాహన డ్రైవరు సైతం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా తోటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏకమవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తమ బిడ్డ పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాల నుంచి ఏ ఒక్కరూ బయటకు రాలేదు. కరెస్పాండెంట్‌ తన వాహనంలో వెళ్లిపోతుండగా.. బాధిత బాలిక తల్లి దాని ఎదుట కూర్చొని ఆందోళన చేశారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి.. పరిస్థితిని చక్కదిద్దారు. నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన విషయంపై ఆరా తీశారు. ఇన్‌స్పెక్టరు రాములు నాయక్‌,  సీతారామయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. దర్యాప్తులో వాస్తవాలు పరిశీలిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని