logo

ష్‌..ఆ వైపు చూడొద్దు!

నెల్లూరు నగరంలో అక్రమ భవన నిర్మాణాలకు అధికార పార్టీ నాయకులు కొమ్ము కాస్తున్నారు. అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగానే.. మేమున్నాం అంటూ ప్రోత్సహిస్తున్నారు.

Published : 19 Jan 2023 02:38 IST

నెల్లూరులో జోరుగా అక్రమ నిర్మాణాలు
సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నాయకులు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: నెల్లూరు నగరంలో అక్రమ భవన నిర్మాణాలకు అధికార పార్టీ నాయకులు కొమ్ము కాస్తున్నారు. అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగానే.. మేమున్నాం అంటూ ప్రోత్సహిస్తున్నారు. పేరుకు అనుమతి తీసుకుని.. ఇష్టానుసారం నిర్మిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకుండా అడ్డుకుంటున్నారు. ఎంతలా అంటే.. భవన నిర్మాణ భూమి పూజ దగ్గర నుంచి ప్రారంభోత్సవం వరకు వారే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అక్రమార్కులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ముందుగానే ఓ ప్యాకేజీ మాట్లాడుకుంటూ నయా దందాకు తెరదీశారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఇబ్బంది అని తెలిసినా పట్టించుకోవడం లేదనే మాట వస్తున్నా.. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా అందినకాడికి దోచుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా అధికారులు, పాలకులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది.


రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

అడుగడుగునా ఆక్రమణలు.. అడుగు తీసి అడుగు వేయడానికీ ఎంతో కష్టం. ఎదురుగా వచ్చిన వ్యక్తికి చోటిచ్చి ముందుకు సాగాలంటే సాధ్యం కాని పని. ఇదీ నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారుల్లో దుస్థితి. ఏళ్లుగా పాగా.. అంతకంతకూ రోడ్ల మీదకు వచ్చి మరీ వ్యాపారాలు చేయడం.. భవనాలకు సెల్లార్‌ లేకపోవడం.. ట్రాఫిక్‌ సమస్యలకు గురి చేస్తోంది. కొత్తగా నిర్మించే భవనాలకైనా నిబంధనలు పాటించేలా చూస్తున్నారా? అంటే అదీ లేదు. మరింత రోడ్డుపైకి వచ్చి నిర్మాణాలు చేస్తునఆన నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు పట్టించుకునే స్థితిలో లేరు. ట్రంకు రోడ్డు, కాపు వీధి, మినీ బైపాస్‌, విజయమహల్‌ గేటు, తిప్పరాజు వీధి, పొగతోట, చిన్నబజారు, పెద్ద బజారు, కామాటి వీధి, బీవీనగర్‌, వనంతోపు, రామ్మూర్తినగర్‌, రామలింగాపురం తదితర ప్రాంతాల్లో ఇష్టానుసారం భవన నిర్మాణాలు చేస్తున్నా అడిగే నాథుడే లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా కొనుగోలు చేసేందుకు దుకాణానికి వచ్చిన వారు సైతం.. పార్కింగ్‌ స్థలం లేక రోడ్డుపైనే వాహనాలు పెట్టిపోతుండటం ట్రాఫిక్‌ చిక్కులను జటిలం చేస్తోంది.

వనంతోపు సెంటర్‌లో..  స్టిల్ట్‌, గ్రౌండ్‌, మూడు అంతస్తుల నివాస భవనం నిర్మాణానికి గత ఏడాది మార్చి 24న అనుమతి తీసుకున్నారు. దరఖాస్తులో భవనం చుట్టూ రెండు మీటర్ల స్థలం వదులుతున్నట్లు.. అందులో ఒక మీటరు పచ్చదనం కోసం కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కనీసం రెండు అడుగులు కూడా వదలలేదు. రహదారికి, నిర్మిస్తున్న భవనానికి ఆరు మీటర్ల దూరం ఉన్నట్లు చూపించినా.. అదీ లేదు. కేవలం జీ+3కి అనుమతి తీసుకుని నాలుగో అంతస్తు నిర్మిస్తున్నారు. నివాస భవనానికి అనుమతి తీసుకుని.. వాణిజ్య భవనం నిర్మిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడలేదు. కారణం.. భవన యజమాని మున్సిపల్‌ కాంట్రాక్టర్‌ కావడంతో పాటు రాజకీయ అండదండలు ఉండటమే.

అన్నమయ్య కూడలిలో..  స్టిల్ట్‌+జీ+నాలుగు అంతస్తుల అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. దాని ప్రకారం చుట్టూ 3.50 మీటర్ల స్థలం వదలాలి. అవేమీ పట్టించుకోలేదు. నిబంధనలు తుంగలో తొక్కి.. వాణిజ్య భవనం నిర్మించారు. అగ్నిమాపక యంత్రం తిరిగేందుకు అడుగు స్థలం వదల్లేదు. అధికారులు ఆ భవనం వైపు చూడకుండా ఉండేందుకు ఓ ప్రజాప్రతినిధికి రూ. 50 లక్షలు చెల్లించినట్లు సమాచారం. వైకాపా నాయకుల అండదండలతో నగరపాలక సంస్థ అనుమతి తీసుకోకుండానే హోటల్‌, బార్‌ నిర్వహిస్తున్నారు. పైగా వ్యాపార అనుమతుల కోసం అధికారులకు ఇస్తున్న పత్రాల్లో.. నివాస భవనం అనుమతిని పక్కన పెట్టి.. వాణిజ్య భవనం బ్లూప్రింట్‌ను అధికారులకు అందించడం గమనార్హం.

నెల్లూరు నగరం జొన్నలగడ్డ వారి వీధిలో నిర్మిస్తున్న వాణిజ్య భవనమది. 2022 ఏప్రిల్‌లో తీసుకున్న అనుమతి ప్రకారం.. స్టిల్ట్‌+గ్రౌండ్‌+రెండు అంతస్తులు నిర్మించాలి. భవనం చుట్టూ అగ్నిమాపక యంత్రం తిరిగేందుకు మూడు మీటర్ల స్థలం వదలాలి. అవేమీ పట్టించుకోలేదు. తీసుకున్న అనుమతి కంటే.. మరో అంతస్తు అదనంగా నిర్మించారు. ఒక ఫ్లోరు 278.07 చ.మీటర్లు విస్తీర్ణంలో నిర్మిస్తుండటంతో.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము దాదాపు రూ.40 లక్షలకు గండి పడింది. దీనికి ఆనుకుని నిర్మిస్తున్న మరో రెండు వాణిజ్య భవనాల పరిస్థితి అంతే. కనీసం ఒక్కో భవనానికి మధ్యలో మూడు అడుగుల స్థలం వదల్లేదు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే అన్న ఊహే భయం గొలుపుతోంది.


నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

- హరిత, కమిషనర్‌, ఎన్‌ఎంసీ

భవన నిర్మాణాల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తీసుకున్న అనుమతి ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలి. ఎక్కడైనా అక్రమంగా కడుతున్నట్లు గుర్తిస్తే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. నగరంలో ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలను పరిశీలించి.. ఉల్లంఘనలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని