logo

ప్రమాదంలో లారీ దగ్ధం.. డ్రైవరు సజీవ దహనం

ప్రమాదంలో లారీ దగ్ధమవగా డ్రైవరు సజీవ దహనమైన విషాద సంఘటన దగదర్తి మండలం దామవరం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగింది.

Updated : 02 Feb 2023 03:28 IST

దగ్ధమవుతున్న లారీ

దగదర్తి, న్యూస్‌టుడే: ప్రమాదంలో లారీ దగ్ధమవగా డ్రైవరు సజీవ దహనమైన విషాద సంఘటన దగదర్తి మండలం దామవరం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నర్సీపట్నం నుంచి చెన్నైకు కాఫీ గింజల లోడుతో మినీ లారీలో డ్రైవర్‌ బెన్నేసులు (61),  క్లీనర్‌ గొల్లి స్వామి(22) బయల్దేరారు. లారీలోనే వంట చేసుకునేందుకు సిలిండరు, సామగ్రి సిద్ధం చేసుకున్నారు. వీరు వెళుతున్న లారీని వెనుక నుంచీ సిమెంట్‌ లోడుతో వెళుతున్న మరో లారీ దామవరం సమీపంలో వేగంగా ఢీకొంది. మినీలారీలోని సిలిండరు లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. డ్రైవరు బెన్నేసులు తప్పించుకోలేక మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యాడు. క్లీనర్‌ గొల్లి స్వామి లారీలో నుంచి దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. భారీగా మంటలు వ్యాపించడంతో స్థానికులు దగ్గరకు వెళ్లలేక నిస్సహాయంగా చూస్తుండిపోయారు. అగ్నిమాపక  సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. మృతుడి స్వగ్రామం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని శివపురమని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని బిట్రగుంట ఎస్సై చినబలరామయ్య పరిశీలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని