logo

గ్రామీణ యువత.. ప్రతిభా గీతిక

వారు గ్రామాల్లో పుట్టారు. పేదమధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఒకరికి తండ్రి లేరు. తల్లి కష్టంతో చదువుకుంటున్నారు. ఇంకొకరు రైతు కూలీల ఇంట పుట్టారు.

Published : 26 Mar 2023 03:03 IST

సాధన చేస్తున్న క్రీడాకారులు

న్యూస్‌టుడే, కావలి: వారు గ్రామాల్లో పుట్టారు. పేదమధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఒకరికి తండ్రి లేరు. తల్లి కష్టంతో చదువుకుంటున్నారు. ఇంకొకరు రైతు కూలీల ఇంట పుట్టారు. అది కూడా మారుమూలప్రాంతం. మరొకరు ఆటోడ్రైవర్‌ కుమార్తె. వీరు కష్టపడి ఆటల్లో ప్రావీణ్యం సంపాదించారు. జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. దీంతో వాటిల్లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. పట్టణంలోని డీబీఎస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శిక్షణ పొందుతున్నారు. ఇందులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది పాల్గొంటున్నారు.


ఆటోడ్రైవర్‌ కుమార్తె.. స్టార్‌ ఆఫ్‌ ఇండియా

పాత ఉమ్మడి జిల్లాలోని గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలోని తిక్కవరం గ్రామానికి చెందిన ఎం. శ్వేత వరుసగా రెండేళ్ల నుంచి స్టార్‌ ఆఫ్‌ ఇండియాగా దేశవ్యాప్త బ్యాడింటన్‌ పోటీల్లో అవార్డు అందుకుంది. సీనియర్‌ నేషనల్స్‌ టోర్నమెంట్‌లో 2021, 22 సంవత్సరాల్లో అవార్డు లభించింది. ఈసారి కూడా అదే ఘనత పొందుతానని చెబుతుంది. క్రీడల కోటాలో లభించిన ప్రవేశంతో  చెన్నైలో ఇంజినీరింగ్‌ చదువుతుంది. దీంతో ఆమె చదివే విశ్వవిద్యాలయం తరఫున కూడా పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపింది. ఈమె తండ్రి మల్లికార్జున్‌ ఆటోడ్రైవర్‌, తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. జాతీయ స్థాయి పోటీల్లో ఘనత చాటి   కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడతానని  శ్వేత చెబుతుంది.


తల్లి కష్టంతో..

ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలోని నీలకంఠాపురం గ్రామానికి చెందిన పి.ఏడుకొండలు క్రీడల కోటాలో వచ్చిన సీటుతో బెంగళూరులోని ప్రముఖ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. విద్యాభ్యాసంతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నాడు. ఇతని తండ్రి వెంకటేశ్వర్లు మరణించారు. తల్లి మల్లమ్మ వ్యవసాయ పనులు చేస్తూ  చదివిస్తుంది. ఆమె ఆశలు నెరవేర్చేలా జాతీయస్థాయిలో సత్తా చాటుతున్నాడు. గతంలో 2018లో జరిగిన జాతీయస్థాయి సబ్‌ జూనియర్స్‌ పోటీల్లోనూ ప్రతిభ చూపాడు. జాతీయ సీనియర్స్‌ బాల్‌బ్యాడ్మింటన్‌ -2020 చెన్నై సెయింట్‌ జోసెఫ్‌ క్రీడామైదానంలో జరిగిన పోటీల్లోనూ పాల్గొన్నాడు. బెంగళూరులో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ బ్యాడ్మింటన్‌ 2023 పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈసారి మహారాష్ట్ర పోటీల్లో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. రైల్వేలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు.


రైతు బిడ్డ జాతీయ ఖ్యాతి

ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం కొత్త సీతారామపురానికి చెందిన జి.నాగూర్‌మీరా పలుమార్లు జాతీయస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో సత్తా చాటాడు. చెన్నై నగరంలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో క్రీడా కోటాలో వచ్చిన సీటుతో చదువుతున్నాడు. తండ్రి మస్తాన్‌, తల్లి ఖాసింబి. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తుంటారు. ఇతను గత జనవరిలో కేరళ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి సీనియర్‌ నేషనల్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. జూనియర్స్‌ పోటీల్లో 2019లో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణపతకం అందుకున్నాడు. కరోనా అనంతరం 2021, 2022లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రజత పతకం సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని లక్ష్యంతో సాధన చేస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని