logo

పసుపు రైతుకు అగచాట్లు

రూ. లక్షల పెట్టుబడి పెట్టి.. ఆరుగాలం శ్రమించిన పసుపు రైతు.. తీరా పంట చేతికొచ్చిన సమయానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 30 Mar 2023 03:46 IST

ఉదయగిరి, సీతారామపురం, న్యూస్‌టుడే

రూ. లక్షల పెట్టుబడి పెట్టి.. ఆరుగాలం శ్రమించిన పసుపు రైతు.. తీరా పంట చేతికొచ్చిన సమయానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెగుళ్ల కారణంగా.. అసలే ఆశించిన దిగుబడులు రాకపోగా- మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు సైతం లేక పరేషాన్‌ అవుతున్నారు. కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయకపోతే.. తాము గట్టెక్కడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కల్లాల్లో పసుపు కొమ్ములు

జిల్లాలోనే ఉదయగిరి ప్రాంతం పసుపు సాగుకు ప్రసిద్ధి. ముఖ్యంగా ఉదయగిరి మండలంలోని కొండ కింద పల్లెలైన కృష్ణారెడ్డిపల్లి, బిజ్జంపల్లి, కొత్తపల్లి, లింగమనేనిపల్లి, బండగానిపల్లి, అయ్యవారిపల్లి తదితర గ్రామాల్లో రైతులు సాగు చేస్తారు. సీతారామపురం, దుత్తలూరు మండలాల్లోనూ సాగు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది సుమారు 300 ఎకరాల్లో వేసినట్లు రైతులు చెబుతున్నారు.

తెగుళ్లతో సతమతం

విత్తనం పసుపు, ఎరువులు, కూలీలు, వ్యవసాయం తదితర ఖర్చులు కలుపుకొని ఎకరం సాగుకు రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.40 లక్షల వరకు పెట్టుబడి పెట్టడంతో పాటు పంట తవ్వకాల సమయంలో కూలీ ఖర్చుల కింద ఎకరాకు రూ. 30 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇంతా చేసి.. ఎలాంటి తెగుళ్లు సోకకుండా ఉంటే.. ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వేరు, దుంప కుళ్లు తెగులు వెంటాడటంతో 30 నుంచి 40 క్వింటాళ్లలోపు మాత్రమే దిగుబడి వచ్చిందంటున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఎండు పసుపు క్వింటా రూ. 4,500 నుంచి రూ. 5,500లోపు మాత్రమే పలుకుతోంది. ఈ లెక్కన పెట్టుబడులు సైతం దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పంట సాగు చేసిన వారు నష్టపోవాల్సి వస్తోందని అంటున్నారు.

కొనుగోలు కేంద్రం కోసం..

ప్రభుత్వం స్థానికంగా పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అందుకోసం ఇటీవల నిరసన సైతం తెలిపారు. గత ఏడాది మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఉదయగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి.. క్వింటా రూ. 6,850 మద్ధతు ధరతో కొనుగోలు చేశారు. ఈ ఏడాదీ అదే రీతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


గిట్టుబాటు ధర కల్పించకపోతే నష్టాలే

దేవసాని శ్రీనివాసులురెడ్డి, రైతు

నాకున్న అయిదు ఎకరాల్లో సుమారు రూ. 6 లక్షలకుపైనే పెట్టుబడి పెట్టి.. పంట సాగు చేశా. తెగుళ్ల కారణంగా ఆశించిన మేర దిగుబడి రాలేదు. మార్కెట్‌లోనూ ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ఉదయగిరిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి.. మద్ధతు ధరకు కొనుగోలు చేస్తే కాసింత ఊరట కలుగుతుంది. లేదంటే.. రైతులంతా తీవ్రంగా నష్టపోతారు. ఇకపై పంట సాగు చేయలేని పరిస్థితి తలెత్తుతుంది.


జీవో రావాల్సి ఉంది

పవన్‌కుమార్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం

ఉదయగిరిలో పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి జీవో రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏమీ రాలేదు. హార్టికల్చర్‌ అధికారుల నుంచి సాగు వివరాలు రావాల్సి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు పంట ఏమైనా దెబ్బతిందా? అనే వివరాలు అందాల్సి ఉంది. వచ్చిన వెంటనే ప్రభుత్వానికి పంపుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని