logo

అక్రమాలకు రిజిస్ట్రేషన్‌!

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి ఓ ప్రహసనంలా మారింది. జిల్లాలో మొత్తం 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా- రోజుకు సగటున 150 నుంచి 200 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి.

Published : 26 May 2023 04:15 IST

సూత్రధారులను తప్పించేందుకు యత్నం
చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నాయకుడు
ఈనాడు డిజిటల్‌, నెల్లూరు

జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి ఓ ప్రహసనంలా మారింది. జిల్లాలో మొత్తం 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా- రోజుకు సగటున 150 నుంచి 200 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఒక్క నెల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే (మంగళ, శుక్రవారం మినహా) 40 శాతం వరకు ఉంటాయి. ఇక్కడ ప్రతి పది లక్షల డాక్యుమెంట్‌ వ్యాల్యు రిజిస్ట్రేషన్‌కు 1 నుంచి 5 శాతం మామూళ్లు ఇచ్చుకోవాలన్నది బహిరంగ రహస్యం. అలా వస్తున్న మొత్తాలు అన్ని స్థాయిల్లో పంపకాలు జరుగుతుండగా- కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులకూ నెల వాటాలుగా వెళతాయన్న ప్రచారం జరుగుతోంది. తద్వారా తమపై విచారణలు లేకుండా చేసుకుంటున్నారని మాట వినిపిస్తోంది.

పట్టుబడుతున్నా.. మార్పులేదు..

ఇటీవల కాలంలో నకిలీ రిజిస్ట్రేషన్ల బాగోతాలు తరచూ వెలుగులోకి వస్తుండగా- సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై అనిశా దాడులు సర్వసాధారణంగా మారాయి. అయినా ఇక్కడ పరిస్థితులు మారడం లేదన్న మాట వినిపిస్తోంది. ఉదయగిరి సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న వెంకట రమేష్‌.. సర్వే నంబరు 1లోని 431.29 ఎకరాల మేత పోరంబోకు స్థలంలో 40 ఎకరాలను నకిలీ పత్రాలు సృష్టించి వేరొకరికి విక్రయించగా.. రిజిస్ట్రేషన్‌ చేశారు. స్థానికులు ఆందోళన చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన్ను సస్పెండ్‌ చేశారు. సదరు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం జరిగింది అలాంటిదే అయినా.. ఉన్నతాధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి అధికారులను కాపాడేందుకు పెద్ద వ్యక్తులు రంగంలోకి దిగారనే విమర్శలు ఉన్నాయి.

* దీనిపై జిల్లా రిజిస్ట్రార్‌ బాలాంజనేయులును వివరణ కోరగా.. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్టోన్‌హౌస్‌పేట విషయంలో డీఐజీ ఆదేశాల మేరకు విచారణ చేశామని, నివేదిక అందజేస్తానన్నారు. ప్రస్తుతం దానిపై తానేమీ మాట్లాడకూడదన్నారు.

* స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ డీఐజీ కిరణ్‌కుమార్‌ వివరణ అడగ్గా.. విషయం తెలిసిన వెంటనే విచారణ చేయాలని జిల్లా రిజిస్ట్రార్‌ను ఆదేశించాను. ప్రస్తుతం సెలవులో ఉన్నా.. రాగానే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.

స్టోన్‌హౌస్‌పేట సప‘రేటు’

నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తాజాగా చోటు చేసుకున్న వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వెలుగు చూసిన సర్వే నంబరు 809-ఎ వివాదానికి ఈ కార్యాలయమే కేంద్రంగా నిలుస్తోంది. సదరు భూమిని దూబగుంట గోపికృష్ణమూర్తి నుంచి ఈ ఏడాది మార్చి 14వ తేదీ శ్రీధర్‌రావుకు రిజిస్ట్రేషన్‌ చేయగా.. అదే రోజు ఆ భూమిలోని కొంత భాగాన్ని ఇద్దరు మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ ఇద్దరూ కార్యాలయంలోని ఓ కీలక అధికారికి తెలిసిన వ్యక్తులేనని సమాచారం. వివాదం రావడంతో అదే నెల 29న వాటిని రద్దు చేసుకున్నారు. ఆ వెంటనే అదే భూమిని మరో నలుగురికి రిజిస్ట్రేషన్‌ చేయడం ఉద్దేశపూర్వకంగా జరిగిందేనని అంటున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తం చేతులు మారగా.. రద్దు చేసుకునే సమయంలో.. దాన్ని వారం రోజుల్లో ఇస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ ప్రజాప్రతినిధి అండగా ఉండటంతో.. సూత్రధారులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని