logo

గుప్తనిధులకొచ్చి.. శవమై తేలి

ఉదయగిరి దుర్గం కొండపై గుప్త నిధుల తవ్వకాల కోసం ముఠాతో కలిసి వెళ్లిన ప్రకాశం జిల్లాకు చెందిన ఒక యువకుడు మృత్యువాత పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.

Published : 04 Jun 2023 02:56 IST

ప్రకాశం జిల్లా యువకుడి మృతి
మృతదేహాన్ని మూటగట్టి పడేశారు
ఉదయగిరి దుర్గంపై దుర్ఘటన

ఉప్పు శ్రీను (పాత చిత్రం)

ఉదయగిరి, న్యూస్‌టుడే : ఉదయగిరి దుర్గం కొండపై గుప్త నిధుల తవ్వకాల కోసం ముఠాతో కలిసి వెళ్లిన ప్రకాశం జిల్లాకు చెందిన ఒక యువకుడు మృత్యువాత పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం మేరకు గత నెల 31వ తేదీన ఉదయగిరి దుర్గం కొండపై చిన్న మసీదు ప్రాంతంలో గుప్తనిధుల కోసం ఒక ముఠా తవ్వకాలు చేపట్టింది. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామానికి చెందిన ఉప్పు శ్రీను(35) అనే యువకుడు మరి కొందరు కలిసి తవ్వకాల్లో భాగంగా బ్లాస్టింగ్‌ చేశారు. ఈ సమయంలో ఉప్పుశ్రీను పేలుడు ప్రాంతానికి సమీపంలో ఉండటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో ముఠా సభ్యులు శ్రీను మృతదేహాన్ని మూటకట్టి గుట్టుచప్పుడు కాకుండా ఈనెల ఒకటో తేదీ అర్ధరాత్రి కారులో మృతుడు స్వగ్రామమైన ముటుకులకు తీసుకెళ్లారు. అతని ఇంటి ముందు శవాన్ని పడేసి కారును వేగంగా వెనక్కి మళ్లించుకొని పారిపోయారు. మృతదేహాన్ని ఇంటి వద్ద పడేసి కారు వేగంగా వెళుతున్న విషయాన్ని అదే వీధిలో నిద్రిస్తున్న కొందరు గమనించారు. మూట ఏమిటని తెరచి చూడగా అందులో మృతదేహం కనిపించింది. ఇంటి యజమాని లింగాలును నిద్రలేపి చూపగా తన కుమారుడు శ్రీనుగా ఆయన గుర్తించారు. మూటతోపాటు అందులో రూ. 35 వేలు నగదు, లేఖ ఉంది. ఆ లేఖలో ‘మీ పిల్లాడిని మావద్దకు పనికి పంపారు. పని చేసే క్రమంలో ప్రమాదవశాత్తు మీ కుమారుడు చనిపోయాడు. మాకు కూడా గాయాలయ్యాయి. మట్టి ఖర్చుల కోసం రూ. 35 వేలు ఇస్తున్నాం. పిల్లల బాధ్యతను కూడా ఎంతో కొంత మేం తీసుకుంటాం’. అని లేఖలో ఉన్నట్లు తెలిసింది. పని కోసమని వెళ్లిన శ్రీను శవంగా రావటం... అసలు అతను ఎలా చనిపోయారన్న విషయం తెలియకపోవటం, మూటలో మృతదేహాన్ని కట్టి ఇంటి వద్దకు తెచ్చి ఎవరు పడేశారన్నది అంతుచిక్కటంలేదు. దీనికితోడు ఇది హత్యా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయం సైతం తెలియటంలేదు. శ్రీను మృతి విషయం సంచలనంగా మారటంతో పుల్లలచెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శ్రీను ఉదయగిరి కొండపై గుప్తనిధుల తవ్వకాలకు వెళ్లి మృతిచెందినట్లు తెలుసుకున్నారు. దీంతో ప్రకాశం జిల్లా పుల్లలచెరువు, పెద్దారవీడు ఎస్సైలు సిబ్బందితో కలిసి ఉదయగిరికి చేరుకున్నారు. ఉదయగిరి సీఐ వి.గిరిబాబు సహకారంతో ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ముఠాలో ఎవరున్నారే విషయాలపై ముమ్మర విచారణ చేపట్టారు. ఉదయగిరి దుర్గంపై చిన్న మసీదు ప్రాంతానికి ఆదివారం పోలీసుల బృందం వెళ్లనున్నదని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని