Nellore: తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం

తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించారు. నెల్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 04 Jun 2023 17:13 IST

నెల్లూరు(కలెక్టరేట్‌): తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించారు. నెల్లూరులోని ఆర్టీఏ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యాలయం నుంచి ఆయన వస్తుండగా సుమారు 10మంది బైక్‌లపై వచ్చి కర్రలతో దాడికి యత్నించారు. వెంటనే తెదేపా కార్యకర్తలు, ఆనం అనుచరులు వారిని అడ్డుకుని ప్రతిఘటించడంతో దుండగులు అక్కడికి నుంచి పరారయ్యారు. ఇటీవల కాలంలో వైకాపా ప్రభుత్వ విధానాలు, సీఎం జగన్‌తో పాటు ఇతర నాయకుల అవినీతిపై వెంకటరమణారెడ్డి ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దుండగులు దాడికి యత్నించినట్లు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

సమాచారం తెలిసిన వెంటనే తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెదేపా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పలువురు తెదేపా నేతలు అక్కడికి చేరుకున్నారు. వెంకటరమణారెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి యత్నాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వైకాపా నాయకులు బరితెగిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో పట్టపగలు దాడులు చేసే కొత్త సంస్కృతికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరిగిన సమాచారం పోలీసులకు తెలియజేస్తే.. ఇద్దరు కానిస్టేబుళ్లని పంపి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని హితవుపలికారు.

వైకాపా ఫ్యాక్షన్‌ ముఠాలకు గుణపాఠం చెబుతాం: లోకేశ్‌

ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందించారు. ఇది వైకాపా మూకల పనే అని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ఉలికిపడుతున్నారని ఆయన విమర్శించారు. వైకాపా ఫ్యాక్షన్‌ ముఠాలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని