logo

వాషింగ్‌మిషన్లో వనదుర్గమ్మ సొత్తు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో జరిగిన చోరీ ఘటనను పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఈ నెల 19న గుర్తు తెలియని వ్యక్తి గర్భగుడిలోకి చొరబడి నగలు, సొత్తు ఎత్తుకెళ్లడంతో మూడు పోలీసు బృందాలు

Published : 23 Jan 2022 04:19 IST

శీలంపల్లిలోని అత్తగారింట్లో దాచిన చోరుడు
న్యూస్‌టుడే, మెదక్‌, చిలప్‌చెడ్‌

పనిచేయని వాషింగ్‌ మిషన్‌ నుంచి సంచి తీస్తున్న పోలీసులు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో జరిగిన చోరీ ఘటనను పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఈ నెల 19న గుర్తు తెలియని వ్యక్తి గర్భగుడిలోకి చొరబడి నగలు, సొత్తు ఎత్తుకెళ్లడంతో మూడు పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. ఎట్టకేలకు శనివారం మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలం శీలంపల్లిలో చోరీకి గురైన సొత్తును గుర్తించారు. మొత్తం రూ.2.36 లక్షలతో పాటు పుస్తెలతాడు, వెండి, బంగారు నగలు, ఐదు కొత్త చరవాణులు లభ్యమయ్యాయి. దొంగతనం చేసింది కామారెడ్డి జిల్లా ఆత్మకూరుకు చెందిన లక్ష్మారెడ్డిగా తేల్చారు. మెదక్‌ డీఎస్పీ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా శనివారం ఉదయం కొల్చారం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం నిందితుడి అత్తగారి ఊరు చిలప్‌చెడ్‌ మండలం శీలంపల్లికి వెళ్లింది. గ్రామానికి చెందిన కొమ్మన్నగారి బాల్‌రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టగా ఐదు చరవాణులు, పుస్తెలతాడు లభించాయి.

ఎవరికీ అనుమానం రాకుండా..
మళ్లీ ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎదురుగా చెడిపోయి ఉన్న వాషింగ్‌ మిషన్‌ను తెరిచి చూడగా ఓ సంచి లభించింది. అందులో చోరీ సొత్తును గుర్తించారు. మొత్తం రూ.2.36 లక్షలు, ఆభరణాలు లభించాయి. నిందితుడి పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు.


జల్సాగా తిరుగుతూ..

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరుకు చెందిన లక్ష్మారెడ్డికి చిలప్‌చెడ్‌ మండలం శీలంపల్లికి చెందిన కొమ్మన్నగారి ప్రవీణతో వివాహమైంది. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రవీణకు పక్షవాతం రావడంతో ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు లక్ష్మారెడ్డి జల్సాల కోసం దొంగతనాలు చేస్తూ పలుమార్లు జైలుకు వెళ్లినట్లు తెలిపారు. సుమారు ఆరేళ్ల తర్వాత శీలంపల్లికి వచ్చినట్లు కుటుంబసభ్యులు, గ్రామస్థులు పోలీసులకు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని