logo

ఉపాధికి వెళ్లి.. ప్రాణాలు విడిచి..

ఉపాధి కోసం పొరుగు రాష్ట్రం వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. ఎడపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోవూరి గంగాధర్‌(39) వారం రోజుల క్రితం మేస్త్రీ పని నిమిత్తం ముంబయి వెళ్లారు.

Published : 02 Oct 2022 04:51 IST

ముంబయిలో రోడ్డు ప్రమాదం.. ధర్మారం వాసి మృతి


గంగాధర్‌(పాత చిత్రం)

ఎడపల్లి, న్యూస్‌టుడే: ఉపాధి కోసం పొరుగు రాష్ట్రం వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. ఎడపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోవూరి గంగాధర్‌(39) వారం రోజుల క్రితం మేస్త్రీ పని నిమిత్తం ముంబయి వెళ్లారు. శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గంగాధర్‌ చనిపోయినట్లు శనివారం ఉదయం కుటుంబ సభ్యులకు అక్కడి పోలీసులు చరవాణి ద్వారా సమాచారం అందించారు. భర్త మృతి చెందడంతో భార్య రాధ, ఇద్దరు చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహన్ని తీసుకొచ్చేందుకు బంధువులు ముంబయి బయల్దేరి వెళ్లారు. మృతదేహం సోమవారం గ్రామానికి చేరుకోనుంది.

విషాదం నింపిన పండగ..
గంగాధర్‌ ఊహ తెలిసిన ముంబయిలోనే మేస్త్రీ పని చేస్తున్నాడు. దసరా పండుగకు భార్య, పిల్లలకు కొత్త బట్టలు కొనడంతో పాటు వేడుకలు ఘనంగా జరుపుకొనేందుకు డబ్బులు అవసరం ఉండడంతో పొరుగు రాష్ట్రం వెళ్లారు. శుక్రవారం ఉదయం భార్యతో చరవాణిలో మాట్లాడారు. అదే రోజు రాత్రి చనిపోయారు. బాధిత కుటుంబానికి గ్రామంలో నివాస గుడిసె ఉండేది. అది కూలిపోవడంతో అదే కాలనీలో అద్దె ఇంట్లో జీవిస్తున్నారు. భార్య, భర్తలు కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తండ్రి చనిపోవడంతో కూతురు సాహిత్య(5), రాజేష్‌(4) భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గూడు లేక కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని